టీ20, వన్డే ఫార్మాట్లలో తనను ఎంపిక చేయలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్లో టీ20, వన్డే సిరీసుల కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ టీంల శిఖా పాండేకు చోటు దక్కలేదు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 120 మ్యాచుల వరకు ఆడిన తనను ఎలాంటి కారణం లేకుండా పక్కన పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో కూడా ఆమె రాణించింది. అలాంటి పాండేకు బంగ్లా టూర్లో జట్టులో చోటు దక్కలేదు. దీనిపై ఒక టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఎమోషనల్ అయిపోయి కన్నీరు పెట్టుకుంది. ఇలా మంచి ఫామ్లో ఉన్నప్పుడు జట్టులో చోటు కోల్పోవడం ఆమెకు ఇదేం కొత్త కాదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 వరల్డ్ కప్లో రాణించిన ఆమె సడెన్గా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయింది.

ఆ నిర్ణయం జీర్ణించుకునేలోపే బంగ్లాదేశ్ టూర్లో కూడా ఆమెను ఎంపిక చేయలేదు. దీని గురించి మాట్లాడిన ఆమె.. 'నాకు కోపం లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు అంటే అసలు నేను మనిషినే కాదు. మనం పడిన కష్టానికి ఫలితం లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా నన్ను పక్కన పెట్టేయడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని అనుకుంటున్నా. అది నాకు తెలీదు అంతే' అని పాండే చెప్పింది.
'మరింత కష్టపడటమే నా చేతుల్లో ఉంది. ఇలా కష్టపడటంతో ఫలితం దక్కుతుందని నేను బలంగా నమ్ముతా. మానసికంగా, శారీరకంగా ఫిట్గా ఉండే వరకు కష్టపడుతూనే ఉంటా' అని ఆమె చెప్పింది. ఈ వెటరన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను గతేడాది వరల్డ్ కప్లో ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం చాలా విమర్శలకు దారితీసింది. దీంతో ఆమెను ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేశారు.
శిఖా పాండేతోపాటు మరో ఇద్దరు వెటరన్ స్టార్లకు కూడా బంగ్లా టూర్లో చోటు దక్కలేదు. రేణుకా సింగ్, రిచా ఘోష్ ఇద్దరిని కూడా ఎందుకు పక్కన పెట్టారో సెలెక్టర్లు ఎలాంటి కారణం చెప్పలేదు. ఈ క్రమంలోనే లైవ్ టీవీలో ఇంటర్వ్యూలో మాట్లాడిన శిఖా పాండే.. తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ మరోసారి బీసీసీఐ సెలెక్టర్లను తిట్టిపోస్తున్నారు.