
హైదరాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్కు గురవడం సర్వసాధారణం. ఈ అనుభవాన్ని ఎంతో మంది క్రికెటర్లు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో 14 ఏళ్ల బాలుడు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఫేస్బుక్ను హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.
సఫారీ పర్యటనలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇనిస్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు అందులో అసభ్యకర ఇమేజిలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలోకి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ చేరాడు. ఆస్ట్రేలియా జట్టు సఫారీ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే.
ఈ టెస్టు సిరిస్ హాట్ హాట్గా సాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్-దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటర్ డీకాక్ల మధ్య చోటు చేసుకున్న వివాదం అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం సృష్టించింది.
చివరకు ఐసీసీ రంగంలోకి దిగి వీరిద్దరికీ జరిమానా విధించడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా, పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్-దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడల వివాదం ఇరు జట్ల మధ్య మళ్లీ గొడవను పెంచింది. రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ను ఔట్ చేసిన అనంతరం అతడి భుజానికి భుజం తాకిస్తూ వెళ్లినందుకు రిఫరీ రబాడ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు విధించాడు.
ఇక, రెండో ఇన్నింగ్స్లో కూడా రబాడ హద్దులు దాటి ప్రవర్తించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటైన తర్వాత అతడని పెవిలియన్కు పంపే క్రమంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. దీంతో రబాడ ఖాతాలో మొత్తం ఎనిమిది డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు డీమెరిట్ పాయింట్లు ఏదైనా ఆటగాడి ఖాతాలో ఉంటే అతడిపై నిషేధం విధిస్తారు.
దీంతో రబాడపై రెండు టెస్టు మ్యాచ్ల నిషేధం పడింది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరి రెండు టెస్టులకు అద్భుతమైన ఫామ్లో ఉన్న రబాడ దూరం కావడంతో సఫారీలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ చేసిన ఓ ట్వీట్ సంచలనమైంది.

అందులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కావాలనే రబాడ భుజాన్ని తాకేలా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. పుట్బాల్లో పెనాల్టీ స్ట్రోక్ కోసం ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను ఏవిధంగా అయితే కవ్విస్తారో స్మిత్ కూడా అదే విధంగా రబాడను కవ్వించాడని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ ఘటనలో స్మిత్పై కూడా చర్యలు తీసుకోవాలని సూచించాడు.
అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత ఫిలాండర్ ఈ ట్వీట్ను డిలీట్ చేశాడు. అంతేకాదు తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, అంతకముందు చేసిన ట్వీట్పై క్షమాపణ కోరుతూ మరోసారి కొత్త ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ మార్చి 22న కేప్ టౌన్ వేదికగా ప్రారంభం కానుంది.