ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 2022 టీ20 వరల్డ్కప్ కోసం వేదికలు ఖరారు అయ్యాయి. మొత్తం 7 వేదికలలో ఈ ప్రపంచకప్ జరగనుంది. ఆ ఏడు వేదికలుగా మెల్బోర్న్, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ ఖరారు అయ్యాయి. ఈ వరల్డ్కప్నకు సంబంధించి తదితర వివరాలను ఈ నెల 21వ తేదీన వెల్లడించనున్నట్లు ఐసీసీ తెలిపింది. 21న మ్యాచ్ల షెడ్కూల్తోపాటు ఏ జట్టు ఏ గ్రూపులో ఉండనుంది వంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
కాగా ఈ ఏడాది సెకండాఫ్లో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య ఈ వరల్డ్కప్ జరగనుంది. నాకౌట్ దశలో జరగనున్న ఈ వరల్డ్కప్లో సిడ్నీ, అడిలైడ్ వేదికల్లో నవంబర్ 9, 10వ తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అలాగే పలు మ్యాచ్ల కోసం టిక్కెట్ల అమ్మకం కూడా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాగా ఇది ఎనిమిదో ఐసీసీ టీ20 ప్రపంచకప్.
అంతర్జాతీయ క్రికెట్లోని టీ20 ర్యాంకింగ్స్ను బట్టి ఇప్పటికే 8 జట్లు ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధించాయి. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే ప్రపంచకప్నకు అర్హత సాధించిన వాటిలో ఉన్నాయి. ఇక మిగతా నాలుగు స్థానాల కోసం పలు జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడనున్నాయి.
యూఏఈ వేదికగా జరిగిన గత ప్రపంచకప్లో సూపర్ 12లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ సారి కూడా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడనున్నాయి. రెండు గ్రూప్లుగా విభజించి క్వాలిఫైయర్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.
కాగా యూఏఈ వేదికగా జరిగిన గత ప్రపంచకప్లో భారత జట్టు తీవ్రంగా నిరాశపరించింది. కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండా సూపర్ 12 దశలోనే ఇంటి ముఖం పట్టింది. అంతే కాకుండా వరల్డ్ కప్ చరిత్రలో తొలి సారి పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఇక ఆ ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 ప్రపంచకప్ జరగుతున్న సమయంలోనే కోహ్లీ టీ20లకు కెప్టెన్గా తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తొలగించింది. ఇక తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకోవడంతో కెప్టెన్గా విరాట్ శకం ముగిసింది.