
టీమిండియాదే పైచేయి:
తాజాగా వెంకటేశ్ ప్రసాద్ పీటీఐతో మాట్లాడుతూ... 'రెండు ఉత్తమ జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నాయి. బెంచ్ చాలా బలంగా ఉన్నందున టీమిండియాకు ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందుకే బ్యాటింగ్ లేదా సీమింగ్.. పిచ్ ఏదైనా టీమిండియాదే పైచేయి. భారత్ ఇప్పుడు బ్యాటింగ్ పరంగా చూసినా, బౌలింగ్ పరంగా చూసినా అత్యుత్తమంగా కనిపిస్తోంది. 1990, 2000 కాలంలో కేవలం ఇద్దరు మాత్రమే సరైన ఫాస్ట్ బౌలర్లు ఉండేవారు. అప్పుడు ముగ్గురు, నలుగురు పేసర్లు అందుబాటులో ఉండేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు' అని అన్నారు.

ఎలాంటి పిచ్ మీద ఆడుతున్నామనేది కాదు:
'భారత జట్టులో ఇప్పుడు నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. మంచి ఆల్రౌండర్లూ ఉన్నారు. భారత్ ఎప్పుడూ ప్రపంచశ్రేణి స్పిన్నర్లతో కొనసాగేది. అయితే ఇప్పుడు అద్భుతమైన పేస్ బౌలింగ్ను కూడా సొంతం చేసుకుంది. మరోవైపు స్కోరు బోర్డుపై 350 పరుగులు సాధించే బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. దాంతో భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా మారింది. ఇప్పుడు ఎలాంటి పిచ్ మీద ఆడుతున్నామనేది కాదు. టీమిండియా ఆడుతుంది అనేలా ఉండాలి' అని వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో జవగల్ శ్రీనాథ్తో కలిసి వెంకీ కొత్త బంతిని పంచుకున్నారు.

తుది జట్టులో వారిద్దరూ ఉండాలి:
'ఫైనల్ పోరులో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా కచ్చితంగా ఉండాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వారిద్దర్నీ ఎంచుకుంటాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు సరైన కాంబినేషన్. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ సరిపోతారు. ముగ్గురూ లైన్ అండ్ లెంగ్త్లో మంచి అనుభవం కలిగినవారు. మ్యాచ్ ఐదు రోజులు పూర్తిగా జరగాలి. భారత్లో మాదిరి మూడు, నాలుగు రోజుల్లో పూర్తవ్వకూడదు. బ్యాట్స్మెన్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. బౌలర్లు కూడా తమకు అనువైన బౌలింగ్ ఎండ్ను ఎంచుకోవాలి. ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడటం కివీస్ జట్టుకు మేలుచేస్తుంది. అయితే భారత్ ప్రాక్టీస్కు కూడా తగినంత సమయం దొరికింది. కానీ పరిస్థితులకు అలవాటు పడటమే కీలకం' అని భారత మాజీ పేసర్ వెంకీ చెప్పుకొచ్చారు.

ఆట అవసరమని భావిస్తేనే:
సౌతాంప్టన్లోని ఏజీస్ బౌల్ మైదానం వేదికగా టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్కు ఐసీసీ జూన్ 23ని రిజర్వ్డేగా కేటాయించింది. ఈ ఐదు రోజుల మ్యాచ్లో కోల్పోయిన ఆటను చివరి రోజు ఆడించనున్నారు. అయితే దీనిపై ఐదో రోజు చివరి గంటలో మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకోనున్నాడు. ఆట అవసరమని భావిస్తేనే రిజర్వ్డేను ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఫలితం తేలని పరిస్థితిల్లో మ్యాచ్గా డ్రాగా పరిగణించి ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఇక భారత కాలమానం ప్రకారం సాయంత్ర 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్షప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications












