ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే అరంగేట్రం చేశాడు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అతడికి క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. తద్వారా వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రం చేసిన సెకండ్ ఓల్డెస్ట్ ఇండియన్ గా నిలిచాడు. అంటే భారత్ తరఫున లేటు వయసులో వన్డేలో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 33 ఏళ్ల 164 రోజుల వయసులో అతడు ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు ఫరూఖ్ ఇంజినీర్ (1974లో 36 ఏళ్ల 138 రోజులు) ఈ జాబితాలో ఉన్నాడు.
గత 51ఏళ్లలో తొలి ప్లేయర్ వరుణే
1974లో టీమిండియా లీడ్స్ వేదికగా తొలి సారి ఇంగ్లాండ్ పై వన్డే మ్యాచ్ ఆడింది. అంటే అప్పటి నుంచి.. గత 51ఏళ్లలో లేటు వయసులో(33 ఏళ్ల తర్వాత) ఇంగ్లాండ్ పై భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేసిన తొలి ఆటగాడు వరుణ్ చక్రవర్తినే. మొత్తంగా లేటు వయసులో ఇంగ్లాండ్ పై భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు. ఫరూఖ్ ఇంజనీర్, వరుణ్ చక్రవర్తి, అజిత్ వాడేకర్, దిలీప్ దోషి, సయద్ అబిద్ అలీ ఈ జాబితాలో నిలిచారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్..
కాగా, ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారని తెలుస్తోంది. అందుకే ఆ దిశగా కసరత్తులు చేస్తూ.. వరుణ్ చక్రవర్తికి ఈ రెండో వన్డేలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.