ఐపీఎల్-2024 సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఘనత సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 16 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42; 21 బంతుల్లో, 6x4,2x6) టాప్ స్కోరర్. బుమ్రా (2/39), పీయూష్ చావ్లా (2/28) చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్ (40; 22 బంతుల్లో, 5x4, 2x6), తిలక్ వర్మ (32; 17 బంతుల్లో, 5x4, 1x6) పోరాడారు. వరుణ్ చక్రవర్తి (2/17), రసెల్ (2/34), హర్షిత్ రాణా (2/34) తలో రెండు వికెట్లు తీశారు.

అయితే వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఓ దశలో ముంబై విజయం దిశగా దూసుకెళ్లింది. ఛేదనలో 5 ఓవర్లకు 59/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత వరుణ్ బంతిని అందుకుని మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. అలాగే వరుణ్తో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించిన కేకేఆర్ నిర్ణయాన్ని వీరూ ప్రశంసించాడు. 16 ఓవర్ల మ్యాచ్లో ఓ బౌలర్ మాత్రమే నాలుగు ఓవర్లు బౌలింగ్ వేయాలి. ముంబై తరఫున బుమ్రా, కేకేఆర్ తరఫున వరుణ్ 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
''అంతర్జాతీయ క్రికెట్, టీ20 లీగ్ల్లో సత్తాచాటిన సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ కేకేఆర్లో ఉన్నారు. కానీ వాళ్లతో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించలేదు. గొప్పగా బౌలింగ్ చేసిన వరుణ్తో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించి కోల్కతా మంచి నిర్ణయం తీసుకుంది. అయితే వరుణ్ బౌలింగ్లో జాగ్రత్తగా ఆడి, మిగిలిన బౌలర్లపై ముంబై ఎటాక్ చేయాల్సింది. ముంబై మెరుగైన ప్రణాళికతో వచ్చి ఉంటే, వికెట్లు కోల్పోకుండా మ్యాచ్ను గెలిచేది''

''వరుణ్ ఈ మ్యాచ్లోనే కాదు, గత మ్యాచ్ల్లో కూడా సత్తాచాటాడు. కానీ అతను టీ20 వరల్డ్ కప్కు సెలక్ట్ కాలేదు. వరుణ్ ఈ మెరుగైన ప్రదర్శనలను కాస్త ముందుగా చేసి ఉంటే, భారత జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేసి ఉండేవారు. కానీ అతను ఆలస్యంగా ఊపందుకున్నాడు'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్కు ఎంపిక చేసిన టీమిండియాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ స్పిన్నర్లుగా ఎంపికయ్యారు.