ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్ లో అతడు మొత్తంగా 14 వికెట్లు తీయడం విశేషం. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. గతంలో వరుణ్ చక్రవర్తి.. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 12 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.
అంతకుముందు వెస్టిండీస్ పేసర్ జేసన్ హోల్డర్ .. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు అతడి పేరిటే ఉంది. 2022లో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో ఈ 15 వికెట్ల రికార్డును క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సిరీస్లో అతడు డబుల్ హ్యాట్రిక్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

స్పిన్ బౌలర్ విషయానికొస్తే.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు వరుణ్ చక్రవర్తి కన్నా ముందు మరో ప్లేయర్ పేరిట ఉంది. న్యూజిలాండ్ కు చెందిన ఐష్ సోధి ఈ ఘనతను అందుకున్నాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు తీసి అదిరే ప్రదర్శన చేశాడు.
ఈ సిరీస్లో వరుణ్ చక్రవర్తి నమోదు చేసిన గణాంకాలు ఇవే
తొలి టీ20లో 3/23 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డను అందుకున్నాడు. రెండో టీ20లో 2/38 చేశాడు. మూడో టీ20లో మళ్లీ అదిరే ప్రదర్శన చేసి 5/24 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక నాలుగో టీ20లో 2/28 బౌలింగ్ ఫిగర్లు నమోదు చేయగా.. ఐదో టీ20లో 2/25 వికెట్లను కుప్పకూల్చాడు. అలా మొత్తంగా 14 వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.