Vaibhav Suryavanshi: ఖతార్ రాజధాని దోహాలో జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్లో మరోసారి భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టాడు. శుక్రవారం (నవంబర్ 21) ఇండియా-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్తో బంగ్లాదేశ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. వైభవ్ ఇన్నింగ్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
253.33 స్ట్రైక్ రేట్తో మెరుపులు
ఈ సెమీఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో అతను అర్థ సెంచరీ చేయలేకపోయినా తన దూకుడుతో భారత ఇన్నింగ్స్కు బలమైన ఆరంభం ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ సూర్యవంశీ 4 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. వైభవ్ 253.33 అనే అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం విశేషం. బంగ్లాదేశ్ బౌలర్ అబ్దుల్ గఫార్ సక్లైన్ నాలుగో ఓవర్ నాలుగో బంతికి వైభవ్ను ఔట్ చేయడంతో అతని విధ్వంసం ముగిసింది.

యూఏఈపై మెరుపు సెంచరీ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ను వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన ఇన్నింగ్స్తో ప్రారంభించాడు. యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 42 బంతుల్లో 144 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో భారత్ 20 ఓవర్లలో 297/4 పరుగులు చేయగా.. యూఏఈ కేవలం 149/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ 148 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ భారీ లక్ష్యం
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. హబీబుర్ రెహమాన్ (46 బంతుల్లో 65 పరుగులు) అత్యధిక స్కోరు చేయగా.. ఎంఎం మెహ్రోబ్ (18 బంతుల్లో 48 పరుగులు), జిషాన్ ఆలం (14 బంతుల్లో 26 పరుగులు) దూకుడుగా ఆడారు.
భారత బౌలర్ల నిరాశ
భారత బౌలర్లు ఈ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. నమన్ ధీర్ 2 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేక అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచాడు. విజయ్కుమార్ విశాక్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.