Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో భాగంగా 47వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ విజయంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్లో అతితక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. దీంతో పాటు అతి తక్కువ వయస్సులో శతకం బాదిన ఆటగాడిగా కూడా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో ఈ బీహారీ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశంసలతో పాటు నగదు వర్షం కూడా కురిసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ.16 లక్షల ప్రైజ్ మనీని సూర్యవంశీకి అందజేయనున్నట్లు ప్రకటించారు. బీహార్ ప్రభుత్వం వైభవ్ సూర్యవంశీకి రూ.10 లక్షల రివార్డు ఇస్తుందని.. నితీష్ ఆయనను అభినందించి ప్రకటించారు.
సోమవారం రాత్రి జైపూర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిని వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్స్ కొట్టడం ద్వారా అతి తక్కువ వయస్సులోనే టీ20 సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ ప్రపంచం మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా వైభవ్ సూర్యవంశీని అభినందిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల రివార్డును ఇస్తున్నట్లు ప్రకటించారు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లా నివాసి వైభవ్ సూర్యవంశీకి సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేసి మరీ అభినందించారు.

అభినందించిన సీఎం నితీష్ కుమార్
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అభినందన సందేశంలో.."వైభవ్ సూర్యవంశీ తన కృషి, ప్రతిభతో భారత క్రికెట్కు ఆశాకిరణంలా మారాడు. నేను 2024లో అతడిని, అతడి తండ్రిని కలిశాను. వైభవ్ కు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు అతడి అద్భుతమైన ప్రదర్శన చూసి రాష్ట్రం గర్విస్తోంది. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్లో భారత జట్టుకు కొత్త రికార్డులు సృష్టించి దేశానికి కీర్తిని సంపాదించాలి. అతడికి నా శుభాకాంక్షలు."అని నితీష్ కుమార్ అభినందించారు. కేంద్ర మంత్రి చిరాక్ పాశ్వాన్ కూడా యువ క్రికెటర్ ను ప్రశంసించారు. వైభవ్ సూర్యవంశీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు.
అభినందించిన డిప్యూటీ సీఎం
వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ సాధించినందుకు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా అభినందనలు తెలిపారు. "ఐపీఎల్లో బీహార్ పుత్రుడు వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన, ప్రతిభను గౌరవిస్తూ సీఎం నితీష్ కుమార్ రూ.10 లక్షల ప్రోత్సాహక మొత్తాన్ని ప్రకటించారు. "అని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అతి చిన్న వయస్సులోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీకి మరోసారి అభినందనలు తెలియజేశారు. ప్రతీ బీహారీ వైభవ్ సూర్యవంశీని చూసి గర్వపడతారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆటగాళ్లకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుందన్నారు.
అభినందనలు తెలిపిన తేజస్వి యాదవ్
బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా వైభవ్ సూర్యవంశీకి అభినందనలు తెలిపారు. బీహార్ అబ్బాయి వైభవ్ సూర్యవంశీని చూసి గర్విస్తున్నామని తేజస్వి యాదవ్ రాసుకొచ్చారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.