Vaibhav Suryavanshi: ఇండియా అండర్ 19 జట్టు, ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య జరుగుతున్న యూత్ వన్డే సిరీస్లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రెండు అత్యద్భుతమైన రికార్డులను సృష్టించి అదరగొట్టాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత్ అండర్ 19 జట్టు 5 వన్డేల సిరీస్లో మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో అద్భుతంగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. 31 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే 80 లేదా అంత కంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడు అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 31 బంతుల్లో 86 పరుగులు చేసినప్పుడు.. అతని స్ట్రైక్ రేట్ 277.41గా ఉంది.

దీనికి ముందు సురేష్ రైనా స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై 2004లో ఆడిన మ్యాచ్లో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అప్పుడు సురేష్ రైనా స్ట్రైక్ రేట్ 236.84గా ఉంది. ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు బద్ధలుకొట్టాడు. అంతేకాకుండా.. భారత ఆటగాళ్లలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాల్గవ స్థానంలో వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 6 బౌండరీలు, 9 సిక్సర్లు కొట్టాడు. దీని ద్వారా ఒకే అండర్ 19 మ్యాచ్లో 9 సిక్సర్లు కొట్టిన మొదటి భారత ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. దీనికి ముందు మన్దీప్ సింగ్ ఆస్ట్రేలియా జట్టుపై 2009లో ఒకే మ్యాచ్లో 8 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టి, కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అంతకుముందు 19 బంతుల్లో 48 పరుగులు, 39 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించిన 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత అండర్ 19 జట్టు, 34.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీతో పాటు, విహాన్ మల్హోత్రా అద్భుతంగా ఆడి 34 బంతుల్లో 46 పరుగులు చేశాడు.ఆ తర్వాత 6 వికెట్లు కోల్పోయిన తర్వాత, ఏడవ స్థానంలో వచ్చిన కనిష్క్ చౌహాన్ 42 బంతుల్లో 43 పరుగులు, ఆర్ఎస్ అంబరీష్ 30 బంతుల్లో 31 పరుగులు చేసి భారత జట్టు విజయాన్ని ఖరారు చేశారు.