
భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. చాలా కష్టమైన బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్లను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న ట్రావిస్ హెడ్ (32) తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అయితే అతని పార్టరన్గా వచ్చిన మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (104 నాటౌట్) మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
చక్కని బంతులకు డిఫెన్స్ ఆడుకుంటూ.. చెత్త బంతులపై బల ప్రదర్శన చేస్తూ అసలు సిసలు టెస్టు ఇన్నింగ్స్ ఆడాడీ లెఫ్ట్ హ్యాండర్. మార్నస్ లబుషేన్ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఇలాంటి సమయంలో స్టీవ్ స్మిత్ (38), పీటర్స్ హాండ్స్కోంబ్ (17)తో కలిసి కీలక భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు ఖవాజా. చివర్లో కామెరూన్ గ్రీన్ (49 నాటౌట్) వేగంగా ఆడుతుంటే అతనికి చక్కని సహకారం అందించాడు. ఈ క్రమంలోనే భారత గడ్డపై తొలి సెంచరీ నమోదు చేశాడు.
మ్యాచ్ అనంతరం తన సెంచరీ గురించి మాట్లాడిన ఖవాజా చాలా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఆ సెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. గతంలో రెండు సార్లు భారత పర్యటనకు వచ్చా. కానీ ఎనిమిది టెస్టుల్లో ఒక్క అవకాశం కూడా రాలేదు. దీంతో డ్రింక్స్ మోసుకుంటూనే గడిపేశా. ఈ మ్యాచ్లో వికెట్ చాలా బాగుంది. నా వికెట్ వాళ్లకు ఇవ్వకూడదని గట్టిగా అనుకున్నా. ఒక విధంగా ఇది పెద్ద మానసిక యుద్ధం. మన ఈగోని పక్కన పెట్టి ఆడాలి' అని చెప్పుకొచ్చాడు. ఖవాజా అద్భుత శతకంతో ఆస్ట్రేలియా జట్టు కూడా మంచి స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఇలా రాణిస్తే భారత్ బౌలర్లు మరింత శ్రమించక తప్పదు.