
ఆడేది ఏ ఫార్మాట్ అయినా డబుల్ సెంచరీ అనేది ప్రతి బ్యాటర్కూ ఒక అరుదైన మైలురాయి. అందుకే ఎవరైనా ఆటగాడు 150పైగా పరుగులు చేస్తే.. అతను డబుల్ సెంచరీ చేసేందుకే ప్రయత్నిస్తాడు. టెస్టు క్రికెట్లో అయితే ఆటగాడు డబుల్ సెంచరీ పూర్తి చేసే వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయరు కెప్టెన్లు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోరు. తమ ఆటగాళ్లు 190లలో ఉన్నా కూడా సడెన్గా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేస్తారు. గతంలో సచిన్ టెండూల్కర్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతను 190లలో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తాము ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఇప్పుడు ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ కూడా అలాంటి పనే చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అద్భుతంగా ఆడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతను 195 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడే సమయంలో మరుసటి రోజు ఆట ప్రారంభవగానే కెప్టెన్ కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే? అని విలేకరులు ప్రశ్నించారు. అదే జరిగితే తాను చాలా బాధ పడతానని ఖవాజా చెప్పాడు. అయితే ఆ మరుసటి రోజున వర్షం బాగా పడటంతో ఆట పూర్తిగా రద్దయింది. దీంతో అతను అదే స్కోరు వద్ద ఉండిపోయాడు.
ఇక నాలుగో రోజు ఆట మొదలవగానే ఖవాజా డబుల్ సెంచరీ చేసుకుంటాడని, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని అంతా అనుకున్నారు. ఎటూ మూడో రోజు మొత్తం వర్షార్పణం అయిన కారణంగా.. మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే అవడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో నాలుగో రోజు ఆట మొదలవగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. దీంతో ఖవాజా తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. ఇది చూసిన నెటిజన్లు కమిన్స్పై మండిపడుతున్నారు. ఒక అరగంట సమయం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తే నష్టమేంటి? ఖవాజాను డబుల్ సెంచరీ చేసుకోనివ్వచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.