హైదరాబాద్: వీరూ నోరు మూయడానికి అరటి పళ్లు ఇవ్వాల్సి వచ్చేదని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ప్రముఖ టీవీ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్, సెహ్వాగ్లు తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఓపెనింగ్ జోడీగా భారత్కు చక్కటి ఆరంభాలిచ్చారు.
ఇటీవల వాట్ ద డక్ పేరిట విక్రమ్ సథాయే నిర్వహించిన షోలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. వీరూ డ్రెస్సింగ్ రూంలో తెగ మాట్లాడే వాడని చెప్పిన సచిన్.. అతడు మాట్లాడకుండా ఉండటం కోసం అరటి పండును ఇచ్చేవాణ్నని చెప్పాడు. డ్రెస్సింగ్లో అరటి పండుతో వీరూ నోరు మూయించగలిగా కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అతణ్ని ఆపడం మన వల్ల కాదని సచిన్ చెప్పాడు.
క్రికెట్లోకి అడుగుపెట్టిన కొత్తలో వీరూ నాతో మాట్లాడే వాడు కాదని చెప్పిన సచిన్.. ఓ రోజు అతడిని తీసుకొని లంచ్కు వెళ్లానని చెప్పాడు. చికెన్ తింటే లావు అవుతారని ఇంట్లో వాళ్లు చెప్పడంతో తినేవాణ్ని కాదని, సచిన్ సలహా మేరకు తినడం ప్రారంభించానని వీరూ చెప్పాడు.
క్రీజులో వెళ్లేటప్పుడు నేను ప్లానింగ్తో వెళ్తే.. వీరూ మాత్రం పాటలు పాడుతూ వచ్చే వాడని సచిన్ గుర్తు చేసుకున్నాడు. 2011 వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమయంలో వీరూతో మాట్లాడుతుంటే అతడు పాటలు పాడుతున్నాడని.. దీంతో పాటలు ఆపకపోతే కొడతానని వార్నింగ్ ఇచ్చానని సచిన్ తెలిపాడు. పాజీ.. పాటలు ఆపేస్తే ఏవేవో ఆలోచనలు వస్తాయి. అందుకే పాటలు పాడుతున్నానని వీరూ చెప్పాడట.