పాకిస్థాన్కు బిగ్ షాక్! టీ20 వరల్డ్ కప్-2024లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న పాక్కు చుక్కెదురైంది. డల్లాస్ వేదికగా గురువారం ఆతిథ్య జట్టు అమెరికాతో జరిగిన మ్యాచ్లో పరాజయాన్ని చవిచూసింది. సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ పోరులో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, ఫీల్డింగ్లో పేలవ ప్రదర్శనతో మెగాటోర్నీని ఓటమితో ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది.
కెప్టెన్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. కెంజిగె (3/30), సౌరభ్ నేత్రావల్కర్ (2/18) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. సారథి మొనాన్క్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), ఆరోన్ జోన్స్ (36 నాటౌట్; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆంద్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటారు. మహ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రవూప్ తలో వికెట్ తీశారు.

స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. అయితే మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయ తప్పి ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నాడు. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ వివరించాడు. పవర్ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని పేర్కొన్నాడు. ప్రత్యర్థి అమెరికా గొప్పగా ఆడిందని అన్నాడు. ''పవర్ప్లేను బ్యాటుతో సద్వినియోగం చేసుకోలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు వెనుకంజలో పడుతుంటాం. ఈ స్థితిలో ఓ బ్యాటర్గా కుదురుకుని, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంటుంది''
''మొదటి ఆరు ఓవర్లలో బంతితోనూ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో మా స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోయారు. ఇవన్నీ మాకు ప్రతికూలంగా మారాయి. యూఎస్ఏ జట్టుకు క్రెడిట్ ఇవ్వాలి. అన్ని విభాగాల్లో మాకంటే గొప్పగా ఆడారు. పిచ్లో కొద్దిగా తేమ ఉంది. అలాగే వికెట్ రెండు విధాలుగా స్పందిస్తుంది. ప్రొఫెషనల్ క్రికెటర్లగా పరిస్థితులు అర్థం చేసుకోవాలి'' అని బాబర్ అజామ్ అన్నాడు.