టీ20 వరల్డ్ కప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ అయిదు పాయింట్లు, +0.127 నెట్రన్రేటుతో తదుపరి దశకు క్వాలిఫై అయ్యింది. బలమైన జట్టు పాకిస్థాన్ను వెనక్కి నెట్టి కప్ వేటలో ముందడుగు వేసింది. ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్తో పాటు అధికారికంగా సూపర్-8లో అడుగుపెట్టింది.
లాడర్హిల్లో శుక్రవారం జరగాల్సిన ఐర్లాండ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ సజావుగా సాగడానికి మైదాన సిబ్బంది ఎంత ప్రయత్నించినా కుదరలేదు.మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటించారు. అమెరికా, ఐర్లాండ్కు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో అమెరికా ఖాతాలో అయిదు పాయింట్లు చేరాయి. మరోవైపు ఐర్లాండ్తో ఆదివారం జరగాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ గెలిచినా గరిష్టంగా నాలుగు పాయింట్లకే చేరుతుంది.

ఆతిథ్య జట్టు పాయింట్లను అధిగమించడానికే ఎలాంటి అవకాశం లేకపోవడంతో పాకిస్థాన్ ఇంటికి, అమెరికా ముందుకు వెళ్లింది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్లో సూపర్ స్టేజ్కు అర్హత సాధించిన ఏడో అసోసియేట్ టీమ్గా యూఎస్ఏ రికార్డు సృష్టించింది. అంతకుముందు ఐర్లాండ్ (2009), నెదర్లాండ్స్ (2014), అఫ్గానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) సూపర్ పోరులకు క్వాలిఫై అయ్యాయి.

కాగా, ఉత్కంఠ పోరులో కెనడాపై గెలుపు, సూపర్ ఓవర్లో పాక్పై సంచలన విజయం నమోదు చేసి సూపర్-8కు చేరుకున్న అమెరికాకు జాక్పాట్ తగిలింది. వచ్చే టీ20 వరల్డ్ కప్-2026కు యూఎస్ఏ అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో సూపర్-8కు చేరుకున్న జట్లు వచ్చే పొట్టి కప్కు నేరుగా క్వాలిఫై అవుతాయి. ఈ సూపర్-8 జట్లతో పాటు ఆతిథ్య జట్లు కూడా అర్హత సాధిస్తాయి. 2026 టీ20 కప్కు భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తుంది. దీంతో ప్రస్తుతం లంక గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించినప్పటికీ వచ్చే మెగాటోర్నీలో ఆతిథ్య దేశంగా నేరుగా క్వాలిఫై అయ్యింది.