యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరేట్, డిఫెండింగ్ ఛాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టోర్నీ మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సీ పాప్రియన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గత 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్లో నాలుగో రౌండ్కు చేరకుండానే జకోవిచ్ నిష్క్రమించడం ఇదే తొలిసారి.
తొలి రెండు సెట్లను కోల్పోయిన జకోవిచ్ ఆ తర్వాత గొప్పగా పంజుకున్నాడు. ప్రత్యర్థిని ప్రతిఘటించి మూడో సెట్ను గెలిచాడు. కానీ నాలుగో సెట్ను చేజార్చుకుని వరల్డ్ నంబర్ 2 టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మరో టైటిల్ సాధించి మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి.. అత్యధికంగా 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాలనుకున్న జకోవిచ్ ఆశలకు బ్రేక్ పడింది.

కాగా, ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్కు చేరిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు యూఎస్ ఓపెన్ ఆదిలోనే నిష్క్రమించడం గమనార్హం. పసిడి సాధించిన జకోవిచ్తో పాటు రజత పతక విజేత కార్లో స్ అల్కరాజ్ కూడా నాకౌటయ్యాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాస్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. నెదర్లాండ్స్ ప్లేయర్, 74వ ర్యాంకర్ అయిన బొటిక్ వాన్డి చేతిలో అల్కరాస్ ఓటమి పాలయ్యాడు.
మరోవైపు పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో నెదర్లాండ్స్ జోడీ సాండర్ అరెండ్స్-రాబిన్ హాస్పై బోపన్న-ఎబ్డెన్ జంట 6-3, 7-5తో నెగ్గింది. డబుల్స్లో యుకి బాంబ్రి-ఒలివెటి (ఫ్రాన్స్), బాలాజీ-ఆండ్రియోజి (అర్జెంటీనా) కూడా రెండో రౌండ్కు చేరారు.