IPL 2025: ఐపీఎల్ 2025 హై-వోల్టేజ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టును 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే కొత్త ఆటగాడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఆ ఆటగాడి మరెవరో కాదు కేకేఆర్ జట్టుపై సిక్సర్లతో విరుచుకుపడిన ఉర్విల్ పటేల్. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ పటేల్ తన సుడిగాలి ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు కొట్టడంతో ఈ యువ ఆటగాడు తన ఐపీఎల్ కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో ఉర్విల్ పటేల్ ఔటయ్యే ముందు కేవలం 11 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఉర్విల్ పటేల్ ఫామ్ కొద్దిసేపు మాత్రమే కొనసాగింది. కానీ ఉర్విల్ బాదిన లాంగ్ సిక్సర్లు సీఎస్కే భవిష్యత్ ఆటగాడిగా ఉండగలడని సూచిస్తున్నాయి.
ఉర్విల్ పటేల్ ఎవరు?
ఉర్విల్ పటేల్ గుజరాత్లోని మెహ్సానాలో 1998 అక్టోబర్ 17న జన్మించాడు. ఉర్విల్ కుడిచేతి వాటం వికెట్ కీపర్-బ్యాటర్. ఉర్విల్ దేశీయ క్రికెట్లో భారత విస్పోటక బ్యాటర్లలో ఒకరిగా ఎదిగాడు. ఉర్విల్ దేశీయ క్రికెట్లో బరోడా, గుజరాత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.

ఉర్విల్ పటేల్ కెరీర్
ఉర్విల్ పటేల్ జనవరి 2018లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. ఫిబ్రవరి 2018లో విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు. ఉర్విల్ పటేల్ 2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.
టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ
2024 నవంబర్లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై 28 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ఉర్విల్ పటేల్ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారతీయుడిగా నిలిచాడు. 35 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అంతకు ముందు నవంబర్ 2023లో ఉర్విల్ పటేల్ విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై 41 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు.
దేశవాళీ క్రికెట్లో రికార్డు ఎలా ఉంది?
ఉర్విల్ పటేల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో ఉర్విల్ 26.43 సగటుతో 423 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఉర్విల్ పటేల్ అత్యధిక స్కోరు 140. లిస్ట్ ఏలో ఉర్విల్ పటేల్ 22 మ్యాచ్లు ఆడి 44 సగటుతో 748 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 అర్థ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏలో ఉర్విల్ పటేల్ అత్యథధిక స్కోరు 116 పరుగులు.
అతడిని కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2023 వేలంలో ఉర్విల్ పటేల్ను గుజరాత్ టైటాన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కానీ ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దేశీయంగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ ఉర్విల్ పటేల్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోలేదు. అయితే మే 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఉర్విల్ పటేల్ను సీజన్ మధ్యలో భర్తీగా పిలిచింది. ఉర్విల్ పటేల్ ట్రయల్ మ్యాచ్లలో సీఎస్కే తరఫున 41, 50 పరుగులు చేశాడు.