మెగా వేలంలో అన్సోల్డ్గా మిగిలిన గుజరాత్ క్రికెటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర శతకాలతో విజృంభిస్తున్నాడు. తనని సొంతం చేసుకోనందుకు అన్ని ఫ్రాంచైజీలు బాధపడేలా కసితో ఆడుతున్నట్లుగా చెలరేగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో మెరుపు శతకం సాధించాడు. అయితే ఈ సారి 36 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు.
ఇండోర్ వేదికగా ఉత్తరాఖండ్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఉర్విల్ పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అంతకుముందు త్రిపురతో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ ఏకంగా 28 బంతుల్లోనే సెంచరీ బాదిన విషయం తెలిసిందే. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్గా చరిత్రకెక్కాడు. రిషభ్ పంత్ పేరిట ఉన్న 32 బంతుల సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ప్రపంచ టీ20 క్రికెట్లో రెండో వేగవంతమైన శతకాన్ని అందుకున్న ప్లేయర్గా ఉర్విల్ రికార్డు నెలకొల్పాడు.

కాగా, ఓపెనర్ ఉర్విల్ పటేల్ శతక్కొట్టడంతో 13.1 ఓవర్లలోనే గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 182 పరుగులు చేసింది. సమర్థ్ (54; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆదిత్య తారే (54; 26 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కునాల్ చండేలా (43; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. విశాల్ జైస్వాల్ నాలుగు వికెట్లు తీశారు.
ఛేదనలో గుజరాత్ 13.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. మరో ఓపెనర్ (23; 13 బంతుల్లో, 4 ఫోర్లు)తో కలిసి ఉర్విల్ ఆది నుంచే దూకుడుగా ఆడటంతో పవర్ప్లేలోనే 88 పరుగులు సాధించింది. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా ఉర్విత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఆరు మ్యాచ్లు ఆడిన గుజరాత్ అయిదు విజయాలతో గ్రూప్-బీలో టాప్లో ఉంది.