న్యూఢిల్లీ : భారత్ పాక్ దాయాదుల మధ్య పోరు అంటే.. క్రికెట్ ప్రపంచం మొత్తం మునివేళ్ల మీద నిలబడి మ్యాచ్ ను తిలకిస్తుంది. ఇండియా పాకిస్తాన్ ప్రజల భావోద్వోగాలతో దీన్ని ముడివేయడంతో.. క్రికెట్ లో ఈ రెండు దేశాలు మైదానంలో తలపడుతుంటే.. అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురవుతారు. అయితే చాలాకాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లకు ఫుల్ స్టాప్ పడిన సంగతి తెలిసిందే.
ద్యైపాక్షిక సిరీస్ లను పునరుద్దరించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇలాంటి తరుణంలో.. యూరీ ఉగ్ర ఘటన చోటు చేసుకోవడం బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఆ ఆలోచనను విరమించుకునేలా చేసింది. తాజాగా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్.
ఉగ్రవాదాన్నే తమ దేశ విధానంగా కొనసాగిస్తోన్న పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు అనురాగ్ ఠాకూర్. యూరీ ఘటనలో పాక్ ఉగ్రవాదులు 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. కాగా, భారత్ పాక్ మధ్య చివరి ద్యైపాక్షిక సిరీస్ 2007లొ జరిగింది. ఇండియా టూర్ కు వచ్చిన పాకిస్తాన్.. మూడు వన్డేలతో పాటు రెండు టీ20లను ఆడింది. బెంగుళూరు వేదికగా రెండు జట్ల మధ్య 2007లో జరిగిన టెస్టు మ్యాచ్.. భారత్ పాక్ ద్వైపాక్షిక సిరీస్ లలో ఆఖరిది.