ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఆర్సీబీ తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ లక్నో సూపర్ జైంట్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్ఘాన్ క్రికెటర్ నవీన్-ఉల్-హక్ మధ్య జరిగిన వాగ్వాదం. ఆ తర్వాత నవీన్ ఉత్ హక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పరోక్షంగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ చేసిన పోస్టింగ్స్తో ఆ వేడి మరింత రాజుకుంది.సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ త్వరగా ఔట్ అయ్యాడు. దీంతో తన హోటల్ గదిలో ఉండి మ్యాచ్ చూస్తున్న నవీన్ ఉల్ హక్ తన పోస్టింగ్తో విరాట్ను గిల్లే ప్రయత్నం చేశాడు. ఓ ఫోటోను షేర్ చేస్తూ స్వీట్ మ్యాంగోస్ అంటూ రాసుకొచ్చాడు.దీంతో విరాట్ కోహ్లీని ఉద్దేశించే నవీన్ ఉల్ హక్ ఈ పోస్ట్ చేశాడంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నవీన్ను విపరీతంగా ట్రోల్ చేశారు.

అయితే దీనిపై నవీన్ ఉల్ హక్ వివరణ ఇచ్చాడు. తనకు సహజంగా మామిడిపండ్లు అంటే చాలా ఇష్టమని తన టీమ్ సిబ్బందితో అదేపనిగా తెప్పించుకుని మామిడిపండ్లు తింటూ ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూశానని వివరించాడు. కేవలం మ్యాంగోస్ చాలా తీపిగా ఉన్నాయని మాత్రమే ఫోటో పెడుతూ పోస్ట్ చేశానని పైగా స్క్రీన్ పై కూడా కోహ్లీ లేడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఫ్యాన్స్ తనను అపార్థం చేసుకుని ట్రోల్ చేశారని నవీన్ ఉల్ హక్ వెల్లడించాడు.
అంతకు కొన్ని రోజుల ముందు ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నవీన్ ఉల్ హక్ , కోహ్లీలు వాగ్వాదానికి దిగడంతో ఇద్దరికీ జరిమానా విధించడం జరిగింది.ఇక ఐపీఎల్ 2024కు మినీ ఆక్షన్కు సిద్ధమవుతున్న వేళ నవీన్ ఉల్ హక్ ఎల్ఎస్జీ జట్టు చేసిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియో ద్వారా స్వీట్ మ్యాంగోస్ ఎపిసోడ్కు ముగింపు పలికినట్లయ్యింది.
వరల్డ్ కప్లో ఇండియా అఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వస్తున్న సమయంలో తనను చూశాడని వెంటనే ఇక ముగించేద్దాం అని తనతో కోహ్లీ చెప్పినట్లు నవీన్ వెల్లడించాడు. ఇందుకు తాను కూడా ఓకే అని చెప్పినట్లు చెప్పాడు. ఇద్దరం నాటి చేదు జ్ఞాపకాలను తలచుకుని నవ్వుకుని ఒకటయ్యామని చెప్పాడు.

ఇక మీదట నా పేరు నీకు వినపడదు అని కోహ్లీ చెప్పినట్లుగా నాకు వినిపించిందని నవీన్ చెప్పాడు. అయితే స్టేడియంలో నెలకొన్న శబ్దానికి తనకు స్పష్టంగా వినిపించలేదని చెబుతూ నవీన్ నవ్వేశాడు.ఇక్కడ అభిమానుల నుంచి నీకు మంచి మద్దతు లభిస్తుందని కోహ్లీ తనతో అన్నట్లు నవీన్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ తర్వాత కూడా జరిగిందేదో జరిగిపోయింది.. వరల్డ్ కప్ను క్రికెట్ను ఎంజాయ్ చేయి అంటూ కోహ్లీ తనతో చెప్పినట్లు నవీన్ వెల్లడించాడు. ఇక వరల్డ్ కప్కు ముందు విరాట్ కోహ్లీ పై ఎలాంటి చెడు ఆలోచన తన మనసులో లేదని చెప్పిన నవీన్... కోహ్లీని స్లెడ్జ్ చేయడం లాంటిదేమీ చేయకూడదని డిసైడ్ అయినట్లు చెప్పాడు.
మొత్తానికి కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య వైరానికి ఎండ్ కార్డ్ పడింది. నవీన్ ఉల్ హక్ తన మనసులో ఉన్నది బయటకు చెప్పడంతో ఇటు కోహ్లీ ఫ్యాన్స్ కూడా చల్లబడ్డారు. ఇక ఐపీఎల్ 2024లో నవీన్ ఉల్ హక్ మరోసారి బంతితో రెచ్చిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.