బెంగళూరు: వెస్టిండీస్ స్టార్ బ్యాట్సుమెన్ క్రిస్ గేల్ బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు! త్వరలో బిగ్ ఇన్నింగ్స్ రానుందని రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అభిమానులకు క్రిస్ గేల్ చెప్పాడు. సోమవారం నాడు జరిగిన మ్యాచులో క్రిస్ గేల్ రాణించాడు.
అయితే, ఆయన ఈ ఐపీఎల్లో క్రిస్ గేల్ ఏమాత్రం రాణించడం లేదు. అతను ఆడిన మ్యాచుల్లో 1, 0, 7, 5, 6 పరుగులు ఉన్నాయి. సోమవారం మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ పైన 31 బంతుల్లో 49 పరుగులు చేసి ఒకింత పాత గేల్ను చూపించాడు.
కోల్కతా తమ ముందు ఉంచిన 184 పరుగుల టార్గెట్ను చేధించేందుకు క్రిస్ గేల్ మంచి పునాది వేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (75 నాటౌట్), ఏబీ డివిల్లీయర్స్ (59 నాటౌట్)లు మ్యాచును గెలిపించారు.

గేల్ ఫాంలోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతను స్పందించాడు. బెంగళూరు అభిమానులకు హామీ ఇచ్చాడు. వారిని అలరిస్తానని చెప్పాడు. మే 18వ తేదీన బెంగళూరు.. కోల్కతా నైట్ రైడర్స్తో చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది.
గేల్ మాట్లాడుతూ.. బెంగళూరు అభిమానులను అలరిస్తానని, ప్రస్తుతం ఫాంలోకి వస్తున్నానని, సంతోషంగా ఉందని, అభిమానులు గేల్ వర్షం కోసం ఎదురు చూస్తుంటారని, కాబట్టి వారి కోరికను నెరవేరుస్తానని చెప్పాడు. బెంగళూరు ఫ్యాన్స్ను ఉద్దేశించి. 'బిగ్ వన్' వస్తోందన్నాడు. అంటే ఈసారి గేల్ వర్షం కురుస్తుందని చెప్పాడు.