టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 మ్యాచ్లు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. ఆంటిగ్వా వేదికగా బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-2లో ఘనంగా బోణీ కొట్టింది. అయితే సౌతాఫ్రికాకు విజయం అంత ఈజీగా దక్కలేదు. అండర్డాగ్స్లా బరిలోకి దిగిన యూఎస్ఏ సఫారీసేనను భయపెట్టింది. ఓ దశలో గెలుపు దిశగా దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 194 పరుగులు చేసింది. డికాక్ (74; 40 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో సత్తాచాటాడు. మార్క్రమ్ (46; 32 బంతుల్లో, 4 ఫోర్లు, ఒక సిక్సర్), హెన్రిచ్ క్లాసెన్ (36 నాటౌట్; 22 బంతుల్లో, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. సౌరభ్ నేత్రావల్కర్ (2/21), హర్మీత్ సింగ్ (2/24) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆండ్రిస్ గౌస్ (80 నాటౌట్; 47 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హర్మీత్ సింగ్ (38; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. రబాడ (3/18) మూడు వికెట్లతో సత్తాచాటాడు. యూఎస్ఏ విజయానికి చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు అవసరమవ్వగా..గౌస్, హర్మీత్ సిక్సర్లతో హోరెత్తించారు. దీంతో గెలుపు సమీకరణం ఆఖరి 12 బంతుల్లో 28 పరుగులుగా మారింది. కానీ రబాడ 19వ ఓవర్లో హర్మీత్ను ఔట్ చేసి రెండు పరుగులే ఇవ్వడంతో అమెరికా ఆశలు ఆవిరయ్యాయి.
కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ వివరించాడు. క్రమశిక్షణలేమి బౌలింగ్ తమ కొంపముంచిందని అన్నాడు. ''విజయానికి దగ్గరగా వచ్చి ఓడితే ఆ బాధ ఎంతో కష్టంగా ఉంది. ఈ మ్యాచ్లో కొన్నిసార్లు మా బౌలింగ్లో క్రమశిక్షణ లోపించింది. మేం మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. ఒక్కసారి మేం మంచి క్రికెట్ ఆడితే ప్రపంచంలో ఏ జట్టును అయినా ఓడించగలం. వచ్చే మ్యాచ్లో బలంగా తిరిగొస్తాం'' అని ఆరోన్ జోన్స్ అన్నాడు.