నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు టీ20 సిరీస్ను టీమిండియా 1-1తో సమం చేసింది. అయితే ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్లో సంజు శాంసన్ (108; 114 బంతుల్లో) ఆట హైలైట్గా నిలిచింది. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ అదరగొట్టాడు.
కెరీర్లో శాంసన్ తొలి సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (52; 77 బంతుల్లో) కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తీసుకోవడంతో ఓ స్థితిలో టీమిండియా రన్రేటు తగ్గింది. కానీ మరో ఎండ్లో ఉన్న శాంసన్ బౌండరీలతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. సఫారీ జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాడాడు. శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ సంజు శాంసన్ను కొనియాడాడు. ''ప్రపంచకప్ ఓటమి ఇచ్చిన నిరాశ తర్వాత తిరిగి మైదానంలోకి రావడం ఆనందంగా ఉంది. జట్టులో ఎంతో మంది ఐపీఎల్లో సత్తాచాటారు. తిరిగి వారందరూ ఇక్కడ కలిసి ఆడటం బాగుంది. సాధారణంగా ఆటగాళ్లకు ఓ విషయం చెబుతుంటా.. ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించండి, మిగిలిన విషయాల్ని వదిలేయండి''
''జట్టులో ఉన్న అందరూ గొప్ప క్రికెటర్లే. వారికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదంతే. కాస్త సమయం ఇస్తే సరిపోతుంది. ఇక జట్టు నిర్దేశించిన పాత్రల్లో వారు సత్తాచాటారు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతడికి మూడో స్థానంలో బ్యాటింగ్కు అవకాశాలు ఇవ్వలేకపోయాం. ఎందుకంటే వన్డేల్లో ఆ కీలక స్థానాలు ఆక్రమించే దిగ్గజాలు ఉన్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది'' అని రాహుల్ అన్నాడు.