న్యూఢిల్లీ: బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలని భావించానని, అయితే దురదృష్టవశాత్తు మిస్సయ్యానని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 2008లో ఆ రికార్డు బద్దలు కొట్టడానికి చాలా దగ్గరగా వచ్చానని చెప్పాడు.
టెస్టుల్లో అత్యధిక వ్యక్తి స్కోరు 400 పరుగులతో లారా పేరు మీద నమోదై ఉంది. రెండు సార్లు ఆ స్కోరుకు చాలా దగ్గరగా సెహ్వాగ్ వచ్చాడు. సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారంనాడు బిసిసిఐ అతన్ని సన్మానించింది.
లారా రికార్డును బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేశారా అని అడిగితే దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచులో ఆట ముగిసే సమయానికి 309 పరుగులు చేసి నాటౌట్గా మిగిలానని, ఆ సమయంలో లారా రికార్డు బద్దలు కొట్టాలని అనుకున్నానని, అయితే మర్నాడు బ్యాటింగ్కు దిగిన తర్వాత 319 పరుగులకు అవుటై దాన్ని మిస్సయ్యానని జవాబిచ్చాడు.
మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడితే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేర్లు చెప్తారని, భారత క్రికెటర్లలో వ్యక్తిగత అత్యధిక స్కోరులకు వచ్చేసరికి తన పేరు వస్తుందని, దానికి తాను గర్విస్తున్నానని సెహ్వాగ్ అన్నాడు.