అన్ని దేశాలు ఒకే బంతిని
టెస్టు ఛాంపియన్షిప్లో అన్ని దేశాలు ఒకే బంతిని ఉపయోగించాలని ప్రతిపాదనకు ఐసీసీ ఆమోదం తెలిపితే దురదృష్టకరమని గవాస్కర్ అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్ అనంతరం టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఛాంపియన్షిప్ నుంచి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒకే బంతిని తీసుకురావాలని ఎంసీసీ సూచించింది.
గవాస్కర్ మాట్లాడుతూ
దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ "బంతిని ప్రమాణీకరించేందుకు ఎంసీసీ ప్రయత్నిస్తోందని తెలిసింది. అలాగే పిచ్లను, బ్యాట్ను.. ఇలాగే క్రికెట్లో అన్నింటినీ ప్రమాణీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఇలా అందరూ ఒకే పరిస్థితుల్లో ఆడాలంటే.. ఇక విదేశీ పర్యటనలకు అర్థమేముంటుంది'' అని గవాస్కర్ ప్రశ్నించాడు.
తాము చెప్పిందే వేదం అన్నట్టుగా
"భారత్లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, నేషనల్ క్రికెట్ క్లబ్ల మాదిరిగానే ఎంసీసీ ఒకటి. కానీ ఎంసీసీ మాత్రం తాము చెప్పిందే వేదం అన్నట్టుగా ఐసీసీ వ్యవహరిస్తోంది. దురదృష్టవశాత్తు నిర్ణయం తీసుకోవాల్సిన చాలామంది ఆ ఎంసీసీ మాటే వింటున్నారు. ఒక గల్లీ నుంచి మరో గల్లీకి వెళ్తేనే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అలాంటిది వివిధ దేశాల్లో తెలియని పరిస్థితుల్లో ఆడటం అన్ని దేశాలకు ఓ సవాల్" అని గవాస్కర్ అన్నాడు.
భారత్లో ఎస్జీ బంతులను వాడుతోన్న టీమిండియా
"టెస్టు క్రికెట్ను ప్రత్యేకంగా నిలిపేది ఇదే. విదేశాల్లో రాణించడంపైనే ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తుంది" ప్రస్తుతం ఇంగ్లాండ్, వెస్టిండీస్ల్లో జరిగే టెస్టుల్లో డ్యూక్ బంతిని వాడుతుండగా.. భారత్లో ఎస్జీ.. మిగతా దేశాల్లో కూకాబుర్రా బంతుల్ని ఉపయోగిస్తున్నారు. అయితే, ఎంసీసీ కొత్త ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరిస్తుందో లేదో చూడాలి మరి.