లండన్: టీమిండియా వరుస వైఫల్యాల గురించి విమర్శలకు దిగేవారే కానీ, ప్రోత్సహిస్తున్న వారు చాలా తక్కువ. భారత బ్యాట్స్మెన్ను వెనకేసుకొస్తున్నఅతి తక్కువ మందిలో ఒకరిగా కుమార సంగక్కర నిలిచాడు. విరాట్ కోహ్లీపై టీమిండియా అతిగా ఆధారపడిందని చెప్పడం భావ్యం కాదని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అన్నారు. సరైన సన్నద్ధత లేకపోవడమే భారత్ వరుస ఓటములకు కారణమని పేర్కొన్నారు. ఓడిన రెండు మ్యాచుల్లో కలిపి విరాట్ కోహ్లీ సాధించిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హమని ఆయన తెలిపాడు.
'కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ అత్యద్భుతంగా ఆడుతున్నాడు. అలాగని మిగతా ఆటగాళ్లను నిందించడం సరికాదు. అతని ఆటను ఆస్వాదించడం చాలా బాగుంటుంది. పుజారా, రహానె చాలా గొప్పగా ఆడతారు. టెస్టులో పుజారా సగటు 50, విదేశాల్లో రహానె సగటు 50కి పైనే ఉంటుంది. ఫామ్లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ ప్రతిభావంతుడిలా కనిపిస్తాడు. మురళీ విజయ్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ ఇలా అందరూ మంచి ఆటగాళ్లే. వారూ గొప్ప బ్యాట్స్మెన్ అనడంలో సందేహం లేదు.' అని సంగా అన్నారు.
'సరైన సన్నద్ధత లేకపోవడమే టీమిండియా ఓటములకు కారణం. దీనిపై టీమిండియా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే టెస్టు మ్యాచ్లో ఆడుతూ సన్నద్ధత గురించి ఆలోచించలేం. మైదానంలో ఇంగ్లీష్ బౌలర్ విసిరే సవాళ్లకు సమాధానాలు చెప్పాలంటే నెట్స్లో, సన్నాహక మ్యాచుల్లో ఆడి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. లార్డ్స్ టెస్టు టాస్ నుంచే ఇంగ్లాండ్ వైపు వెళ్లింది. రెండో రోజు వాతావరణం, పిచ్ ఇంగ్లాండ్ బౌలింగ్కు సహకరించాయి. మూడో రోజు బ్యాటింగ్ చేసేటప్పుడు ఎండ రావడంతో ఇంగ్లిష్ బ్యాట్స్మెన్కే అనుకూలంగా మారింది. అయినప్పటికీ షమి అద్భుతంగా బంతులు వేశాడు' అని సంగక్కర అభిప్రాయపడ్డారు.
ముగిసిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా వైఫల్యాలను చవిచూసింది. మొదటి మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్లో ఏకంగా 159 పరుగులతో పరాజయం పాలైంది. అయితే జరిగిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్మెన్ విఫలమైయ్యారు. తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ, హాఫ్ సెంచరీ పూర్తి చేసి 200 పరుగులు చేయగలిగాడు.