
హైదరాబాద్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్కప్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత యువ జట్టు ఈ మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ 4వ ఓవర్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరాణా అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. క్రీజులో ఉన్న యశస్వి జైస్వాల్కు సంధించిన డెలివరీ 175 kph (108 mph) వేగాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ ఇప్పటివరకు ఇదే వేగవంతమైన డెలివరీ.
కాగా, ఈ డెలివరీని అంఫైర్ వైడ్గా సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. వేగాన్ని కొలిచే స్పీడ్గన్లో సాంకేతిక లోపం కారణంగానే ఆ డెలివరీ వేగం అంత ఎక్కువగా నమోదైందని అంటున్నారు. రికార్డు నమోదుకు సంబంధించి ఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
దీనికి ముందు, అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన డెలివరీని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంధించాడు. 2003 వరల్డ్కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో షోయర్ అక్తర్ 161.3kph (100mph) ఈ డెలివరీని సంధించాడు. ఇప్పుడు ఆ రికార్డుని శ్రీలంక పేసర్ మతీషా పతిరాణా బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యతం వేగవంతమైన టాప్-3 బంతులివే....
* 161.3kph: Shoaib Akhtar, ODI v England in 2003 at Newlands
* 161.1kph: Shaun Tait, ODI v England in 2010 at Lord's
* 161.1kph: Brett Lee, ODI v NZ in 2005 at Napier
అయితే, మతీషా పతిరాణా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. పతిరాణా బౌలింగ్ అచ్చం శ్రీలంక పేసర్ లసిత్ మలింగను పోలి ఉంటుంది. మలింగ బౌలింగ్ యాక్షన్ ఎలాగ ఉంటుదో అతడి బౌలింగ్ యాక్షన్ కూడా అలాగే ఉంది. గతేడాది సెప్టెంబర్లో తాను అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే మతీషా పతిరాణా అదరగొట్టాడు.
మతీషా పతిరాణా వయసు 17 ఏళ్లు. శ్రీలంకలోని కాండీలో ట్రినిటీ కాలేజ్ తరుపున ఆడిన అతడు తన అరంగేట్ర మ్యాచ్లో 6 వికెట్లు తీసి 7 పరుగులిచ్చాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ ప్రదర్శనతోనే మతీషా పతిరాణా ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్కప్లో చోటు దక్కించుకున్నాడు.