ముంబై: అండర్ 19 ఆటగాళ్లు ఎక్కువగా స్ట్రైక్ రొటేషన్ చేసేలా దృష్టిసారిస్తున్నానని భారత అండర్-19 జట్టు కోచ్, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. ఆటగాళ్లలో స్ట్రైక్రొటేషన్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టిపెడుతున్నానని తెలిపాడు.
స్ట్రైక్రొటేషన్ వల్ల ఎంతో ఒత్తిడి తగ్గుతుందని, ఈ అంశంపై ఆటగాళ్లతో చాలాసేపు చర్చించానని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. జనవరి 27 నుంచి బంగ్లాదేశ్లో జరిగే అండర్-19 ప్రపంచకప్ కోసం మంగళవారం భారత జట్టు బయల్దేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ద్రావిడ్ మాట్లాడాడు.
'ఈ కుర్రాళ్లందరూ భారీ షాట్లు ఆడగలరు. భారీ షాట్లు ఆడటం సాధన చేసే తరంలో వాళ్లున్నారు. వాళ్లు కొట్టే కొన్ని సిక్సర్లు మతిపోగొడుతున్నాయి. గత కొన్ని నెలలుగా మేం మంచి పిచ్లపై ఆడాం' అని రాహుల్ ద్రావిడ్ తెలిపారు.

కానీ, ప్రపంచకప్ సందర్భంగా 300 పరుగులు చేయగలిగే పిచ్లు లభించకపోవచ్చన్నాడు. 240-250 స్కోర్లు నమోదయ్యే పిచ్లు ఉండొచ్చునని, ఆటగాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకోవాలని చెప్పాడు.
జనవరి 27 నుంచి జరిగే ప్రపంచ కప్ టోర్నీలో భారత అండర్ 19 జట్టు ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను కోచ్గా ఉండటం వల్ల, తన ఆధ్వర్యంలో ప్రపంచ కప్ తీసుకురావాలని ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి పెట్టడం లేదని చెప్పారు.
అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత జాతీయ జట్టుకు కొందరు అండర్ 19 ఆటగాళ్లు ఎంపికైతే తనకు చాలా సంతోషమని తెలిపాడు. అదే వారి లక్ష్యం కూడా అని చెప్పాడు. న్యూజిలాండ్, ఐర్లాండ్, నేపాల్ జట్లున్న గ్రూప్-డి లోనే భారత జట్టు కూడా ఉంది.