క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయని మరో క్రికెటర్ నిరూపించాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా గ్లౌసెస్టర్షైర్ వికెట్ కీపర్ జేమ్స్ బ్రేసీ కూడా సూర్య తరహాలోనే తమ జట్టును గెలిపించాడు. అయితే ఇది అంతకుమించిన ఉత్కంఠలో జరిగింది.
ప్రత్యర్థి గ్లామోర్గన్ విజయానికి ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరం. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. గ్లామోర్గన్ గెలిస్తే కౌంటీ ఛాంపియన్షిప్లో సంచలనమే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 593 పరుగుల రికార్డు ఛేదన చేసిన తొలి జట్టుగా గ్లామోర్గన్ చరిత్ర సృష్టించింది. ఈ స్థితిలో జేమ్స్ పక్షిలా గాల్లోకి ఎగురుతూ మెరుపు క్యాచ్ అందుకున్నాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

మొదట బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులు చేసింది. అనంతరం గ్లామోర్గన్ మొదటి ఇన్నింగ్స్లో 197 పరుగులు చేసింది. 18 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గ్లౌసెస్టర్షైర్ అయిదు వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ జేమ్స్ బ్రేసీ డబుల్ సెంచరీ బాదాడు. 231 బంతుల్లో 204 పరుగులు చేశాడు. కామెరూన్ బాన్క్రాఫ్ట్ 184 పరుగులు, మైల్స్ 121 పరుగులతో సత్తాచాటారు.
అనంతరం 593 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గన్ 592 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సామ్ నార్త్ఈస్ట్ 187 పరుగులు, మార్నస్ లబుషేన్ 119 పరుగులు చేశారు. కాగా, అజీత్ వేసిన ఆఖరి బంతిని జామీ మెకల్రాయ్ షాట్కు యత్నించాడు. బంతి బ్యాటుకు ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ జేమ్స్ బ్రేసీకి దూరంగా వెళ్లింది. అప్పటికే గ్లవ్స్ తీసి జేమ్స్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.