కోహ్లీ ప్రభావం ఏ మేరకు
హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రభావమేమీ లేదని కపిల్ దేవ్ వెల్లడించారు. "మేం విరాట్ కోహ్లీ అభిప్రాయం తీసుకుంటే మొత్తం జట్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే మేం ఎవ్వరినీ ఏమీ అడగలేదు. అందుకు ఆస్కారమే లేదు. తుది నిర్ణయంపై కోహ్లీ ప్రభావం లేనే లేదు. మేమంతా ఏకగ్రీవంగా రవిశాస్త్రిని ప్రధాన కోచ్గా ఎంపిక చేశాం" అని అన్నారు.
సెమీస్ నిష్ర్కమణలపై
రవిశాస్త్రి నేతృత్వంలోనే టీమిండియా వరుస ప్రపంచకప్ సెమీసుల్లో టీమిండియా నిష్క్రమణపై కపిల్ మాట్లాడుతూ "ఒక జట్టు ప్రపంచకప్ గెలవకపోతే మేనేజర్ను తొలగించాలా? లేదు మొత్తం పరిస్థితిని పరిశీలించాలి. మేం దాన్ని పట్టించుకోలేదు. ఆయన ప్రజెంటేషన్ మాత్రమే చూశాం. ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత టామ్ మూడీ మూడులో, మైక్ హెసన్ రెండులో నిలిచారు. రవిశాస్త్రి టాప్ పొజిషన్లో నిలిచారు" అని అన్నారు.
కమ్యూనికేషన్లో రవిశాస్త్రి ముందంజలో
"హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా బాగున్నారు. కాకపోతే కమ్యూనికేషన్లో రవిశాస్త్రి ముందంజలో ఉన్నాడు. ఎంపికలో అదే కీలకంగా మారింది. అందరి ప్రజెంటేషన్లు చూసిన తర్వాతే మార్కులు ఇచ్చాం. ప్రజెంటేషన్ కోసం వారెంత కష్టపడ్డారో గమనించాం" అని కపిల్ పేర్కొన్నారు.
మార్కులను ఎలా డిసైడ్ చేశామంటే
"మొత్తం ఐదు విభాగాల్లో వారికి మార్కులు వేశాం. అవి కోచింగ్, అనుభవం, విజయాలు, కమ్యూనికేషన్, ఆధునిక టూల్స్పై నాలెడ్జి. చాలా బాగుందికి 20, బాగుందికి 15, ఫర్వాలేదుకు 10, బాగా లేదుకు 5 మార్కులిచ్చాం. నిజాయతీగా చెబుతున్నా. ఎవరెన్ని మార్కులు వేశామో చర్చించలేదు. అన్నీ లెక్క చేసినప్పుడు ముగ్గురి మధ్యన తేడా చాలా చాలా తక్కువగానే ఉంది" అని కపిల్ తెలిపాడు.