
హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని యువ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ పేర్కొన్నాడు. శ్రీలంక వేదికగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు టీ20 సిరిస్కు ఎంపికైన అతడు జట్టుతో కలిసి శ్రీలంక బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడాడు.
జింబాబ్వేతో 2016లో జరిగిన టీ20లో అరంగేట్రం చేసిన ఉనాద్కత్ ఏడాది తర్వాత డిసెంబర్లో శ్రీలంకతో జరిగిన సిరీస్లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన సఫారీ పర్యటనలో కూడా అద్భుత ప్రదర్శనే చేశాడు. ఇప్పుడు శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జరుగుతున్న నిదాహాస్ ట్రోఫీకి ఎంపికయ్యాడు.
ప్రస్తుతం తన దృష్టంతా 50 ఓవర్ల ఫార్మాట్లో చోటు దక్కించుకోవడంపైనే ఉందని ఉనాద్కత్ పేర్కొన్నాడు. 'వన్డేల్లోకి అడుగుపెట్టేందుకు ఈ టీ20 అవకాశాన్ని ఉపయోగించుకుంటా. జట్టులో మంచి ప్రదర్శన గనుక చేస్తే, జట్టు మేనేజ్మెంట్, కెప్టెన్ మద్దతు లభిస్తుంది. గతంలో శ్రీలంకతో ఆడిన అనుభవం ఉంది. అదే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది' అని చెప్పాడు.
'అప్పుడు కూడా టీ20 మ్యాచ్లే ఆడాను. ఇప్పుడు ఆడేదీ టీ20లే. అప్పుడు ఆడిన వారే ఉంటారు కాబట్టి వారికి అనుగుణంగా ప్రణాళికలు రచించి అమలు చేస్తాను. ఈ ముక్కోణపు సిరీస్ నాకో మంచి అవకాశం. ఇప్పటికే కొన్ని సిరీస్లు ఆడాను కాబట్టి జట్టులో కుదురుకోగలిగాను. అంతర్జాతీయ స్థాయిలో నా నైపుణ్యాలు ప్రదర్శిస్తాననే విశ్వాసం కలిగింది' అని జయదేవ్ అన్నాడు.
'దక్షిణాఫ్రికా సిరీస్ నేను నేర్చుకోవడానికి పాఠం లాంటింది. అక్కడి వికెట్లు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ బౌలింగ్ చేసిన అనుభవం పనికొస్తుంది' అని తెలిపాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరిస్లో జయదేవ్ ఉనాద్కత్ నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత సఫారీ గడ్డపై రెండు టీ20ల్లో ఆడిన అతడు మూడు వికెట్లు తీశాడు.
మొత్తం ఆరు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు తీశాడు. ఇక, శ్రీలంక వేదికగా జరిగే ముక్కోణపు సిరిస్లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. మార్చి 6 నుంచి 18 వరకు ఈ సిరిస్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్తో సహా అన్ని మ్యాచ్లు కొలంబోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.