
భారత పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్కు రెడీగా లేడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇండియాన్ ప్రీమియర్ లీగ్ 2022లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. అతను ఆడిన 14మ్యాచ్ల్లో 20.18సగటుతో 22వికెట్లు తీశాడు. ఈ సంవత్సరం ఐపీఎల్లో అతని ప్రదర్శన పట్ల చాలా మంది మంత్రముగ్ధులయ్యారు. అలాగే బీసీసీఐ సైతం ఉమ్రాన్ మాలిక్ను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేసింది. ఐర్లాండ్ పర్యటనలో ఉమ్రాన్ మాలిక్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే అతను ఐర్లాండ్ పర్యటనలో రెండో టీ20లో చివరి ఓవర్లో 17పరుగులు డిఫెండ్ చేసి భారత్కు విజయాన్ని అందించగలిగాడు.
ఆ తర్వాత ఇంగ్లాండ్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో మూడో మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ ఆడాడు. అతను ఆకట్టుకోలేకపోయాడు. అతను నాలుగు ఓవర్లలో 56పరుగులు ఇచ్చుకున్నాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇక భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. మాలిక్ తన పేస్లో మంచి వేగాన్ని కలిగి ఉన్నాడు. చాలా మందికి సాధ్యం కాని వేగంతో అతను బౌలింగ్ వేయగలడు. మీరు వేగంగా వేసేలా ఎవరికీ తర్ఫీదు ఇవ్వలేరు. అది స్వతహాగా అబ్బే లక్షణం. కానీ మీరు మిగతా లైన్ అండ్ లెంగ్త్, యార్కర్, బౌన్సర్, స్లో బాల్స్ తదితర వాటిని నేర్పించవచ్చు. కానీ కచ్చితంగా ఇంత స్పీడ్తో బౌలింగ్ వేయాలనేది ఎవరికి నేర్పించలేరు.' అని చోప్రా ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ను సహజ లక్షణమని పేర్కొన్నాడు.
అయినప్పటికీ ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లు ఆడడానికి ఇంకా సిద్ధంగా లేడని చోప్రా అభిప్రాయపడ్డాడు. మాలిక్కి ఇంకా సమయం అవసరమని, ఇంకా కొంచెం పరిణతి రావాలని ఆకాష్ చెప్పాడు. 'అతనికి వేగం ఉందనే విషయంలో సందేహం లేదు. కానీ ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధంగా లేడని నేను భావిస్తున్నాను. అతనికి ఇంకాస్త టైం కావాలి. అతను ఎక్కువ క్రికెట్ ఆడలేదు. అతనికి ఇంకా అంత అనుభవం రాలేదు.' అని చోప్రా పేర్కొన్నాడు.