
జమ్మూ కశ్మీర్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్.. జట్టుకు అవసరమయ్యే విధంగా తన బౌలింగ్ మెరుగుపర్చుకోగలిగితే.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యేందుకు అతనికి అన్ని అవకాశాలు ఉంటాయని భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2022)లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆడలేకపోయినా.. ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20ల సిరీస్లో అతను ఆడాడు. రెండో టీ20లో చివరి ఓవర్లో 17పరుగులు డిఫెండ్ చేసి జట్టుకు 4పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
ఇక ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్లో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటున్న రోహిత్.. ఉమ్రాన్ మాలిక్కు జట్టులో ఓ నిర్దిష్ట పాత్ర ఇవ్వడానికి మేనేజ్ మెంట్ ప్రయత్నిస్తోందని చెప్పాడు. 'అతను మా ప్లాన్లలో ముఖ్యమైన ప్లేయర్గా ఉన్నాడు. అతని నుంచి జట్టుకు ఏమి అవసరమో కూడా మేము అతనికి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మేము కొంతమంది కుర్రాళ్లను జాతీయ జట్టు తరఫున ఆడించాలని ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే. ఉమ్రాన్ ఖచ్చితంగా అందులో ఒకడు.' అని రోహిత్ పేర్కొన్నాడు.
'ప్రపంచకప్ జట్టు కూర్పులో భాగంగా మేము అతనిపై ఓ కన్నేసి ఉంచాం. అతను జట్టు కోసం ఏం చేయగలడో చూడాలనుకుంటున్నాం. అతను కచ్చితంగా మాకు ఓ ఉత్తేజకరమైన అవకాశం. ఐపీఎల్ సమయంలో అతడు వేగంగా బౌలింగ్ చేయగలడని చూశాం. అతను కొత్త బంతితో బౌలింగ్ చేయించాలా లేక మిడిల్ ఓవర్లలో వేయిస్తే బెటరా అనే విషయాలపై కూడా పరిశీలన చేస్తాం. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడ్డానికి, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడ్డానికి చాలా తేడా ఉంటుంది.' అని రోహిత్ పేర్కొన్నాడు.