
ఎప్పుడు జరిగింది?
ఆఫ్ఘనిస్తాన్తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్కు వచ్చింది. ఓపెనర్గా వచ్చిన కామెరూన్ గ్రీన్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో జట్టును ఆదుకునే బాధ్యతను డేవిడ్ వార్నర్ (25), మిచెల్ మార్ష్ (45) తీసుకున్నారు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ సమయంలో ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్ నాలుగో ఓవర్ వేయడానికి వచ్చాడు.

అసలేం జరిగింది?
ఈ నాలుగో ఓవర్లో నాలుగో బంతిని మిచెల్ మార్ష్ ఎదుర్కొన్నాడు. అతను కొట్టిన బంతిని అందుకున్న ఫీల్డర్ ఓవర్ త్రో వేయడంతో మార్ష్, వార్నర్ ఇద్దరూ వేగంగా మూడు పరుగులు తీశారు. ఇది చాలా వేగంగా జరిగిపోయింది. ఈ క్రమంలో అంపైర్లు, స్కోర్బోర్డు మేనేజర్ పొరబడ్డారు. ఈ ఓవర్ నాలుగో బంతికి రెండు పరుగులు రాగా.. ఐదో బంతికి మూడు పరుగులు వచ్చినట్లు రాసుకున్నారు. ఆ తర్వాతి డెలివరీకి నవీన్ ఉల్ హక్ డాట్ బాల్ వేశాడు. దీంతో ఓవర్ అయిపోయిందని అంపైర్లు ప్రకటించారు.

ఆసీస్ స్కోరులో రెండు పరుగుల కోత
నాలుగో ఓవర్ నాలుగో బంతికి రెండు పరుగులు తీసినట్లు స్కోర్కార్డ్ మేనేజర్ నమోదు చేశాడు కానీ.. ఈ మొత్తాన్ని ఆసీస్ టోటల్ స్కోరులో అతను కలపలేదు. దీంతో అంపైర్ల పొరపాటు వల్ల ఆస్ట్రేలియా జట్టు ఒక బంతి, రెండు పరుగులు కోల్పోయింది. ఆస్ల్రేలియా జట్టు ఈ మ్యాచ్ గెలవడంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఇంగ్లండ్ ఓడితే.. కంగారూలు నేరుగా సెమీస్ చేరతారు. లేదంటే మెరుగైన రన్ రేట్ కారణంగా ఇంగ్లండ్ సెమీస్ చేరి, ఆస్ట్రేలియా ఇంటి దారి పడుతుంది.


Click it and Unblock the Notifications












