
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో తరచూ చర్చనీయాంశమవుతున్న 'అంపైర్స్ కాల్'ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఐసీసీ తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కాల్ కొనసాగించాలని ప్రతిపాదించగా.. ఐసీసీ సైతం సమ్మతించింది. అంపైర్స్ కాల్ విషయంలో గందరగోళం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ వివాదాస్పద నిబంధనపై గురువారం చర్చించింది.
మరోవైపు షార్ట్ రన్ను థర్డ్ అంపైర్ కూడా పరిశీలించి, నిర్ణయాన్ని ప్రకటించేలా ఐసీసీ కొత్త రూల్ తెచ్చింది. ఎల్బీడబ్ల్యూను అంపైర్ నాటౌట్గా ప్రకటించిన సమయంలో ఫీల్డింగ్ జట్టు డీఆర్ఎస్కు వెళితే.. 50 శాతం బంతి వికెట్లకు తగిలినట్టుగా తేలితే ఔట్గా వస్తుంది. ఒకవేళ సగం బంతి కన్నా తక్కువగా తగిలినట్టు తేలితే అంపైర్ కాల్ వచ్చి.. నాటౌట్ అన్న నిర్ణయమే నిలుస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో సీనియర్ టోర్నీల్లో తలపడే జట్లు ఏడుగురు సభ్యులను అదనంగా పెంచుకునే అవకాశం ఐసీసీ కల్పించింది.
'క్రికెట్ కమిటీ ప్రధానంగా అంపైర్స్ కాల్పై చర్చించి విశ్లేషించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్ఎస్లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్ అంపైర్దే తుది నిర్ణయం. అంపైర్ కాల్ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది' అని ఐసీసీ కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు.
ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు ఇవే:
# సమీక్ష ద్వారా ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు పరిశీలించేటప్పుడు వికెట్ ప్రాంతం ఎత్తును పెంచారు. ఇప్పటిదాకా బెయిల్స్ కింద వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు బెయిల్స్ పైభాగం వరకు ఎత్తును లెక్కలోకి తీసుకోనున్నారు.
# బ్యాట్స్మన్ పరుగును పూర్తి చేశాడా లేదా అన్నది మూడో అంపైర్ పరిశీలిస్తాడు. షార్ట్ రన్ చేసివుంటే తర్వాతి బంతి వేసేలోపు ప్రకటిస్తాడు.
# మహిళల వన్డే క్రికెట్ల్లో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించారు.
# మహిళల వన్డే మ్యాచ్లు 'టై'గా ముగిస్తే సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు.
# కరోనా నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ల కోసం 23 మంది సభ్యులతో జట్లను అనుమతించారు.