
అబుదాబి: జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను అఫ్గానిస్థాన్ 1-1తో సమం చేసింది. రెండో టెస్టులో అఫ్గానిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి టెస్ట్ ఓడిపోయిన అఫ్గాన్.. రెండో టెస్టులో మాత్రం అన్ని విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. అయితే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన అఫ్గానిస్థాన్ జట్టుకు అంపైర్లు భారీ షాక్ ఇచ్చారు. అఫ్గాన్ ఫీల్డర్ కావాలనే బౌండరీ అవతల కాలు పెట్టినందుకు.. జింబాబ్వే ఖాతాలో ఐదు పరుగులు అదనంగా చేర్చారు. విషయంలోకి వెళితే...
మ్యాచ్ మూడో రోజు మూడవ సెషన్లో అఫ్గాన్ ఫీల్డర్ హష్మతుల్లా షాహిది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. ప్రత్యర్థి జట్టు టెయిలెండర్కు స్ట్రయికింగ్ రావాలనే వ్యూహంతో బంతిని ఆపే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఒక కాలును బౌండరీ అవతల పెట్టాడు. జింబాబ్వే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సికందర్ రాజా (85).. టెయిలెండర్ల సాయంతో తొలి ఇన్నింగ్స్ను నిర్మించే పనిలో ఉన్నాడు. అతనికి బ్లెస్సింగ్ ముజారాబాని అండగా ఉన్నాడు. ముజారాబాని పరుగులు చేయకున్నా.. రాజాకు అండగా నిలిచాడు. చివరి బంతికి సింగల్ తీస్తూ స్ట్రైకింగ్ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఓవర్ చివరి బంతికి సికందర్ రజా సింగిల్ కోసం షాట్ ఆడాడు. అయితే తర్వాతి ఓవర్లో మళ్లీ రజాకు స్ట్రయికింగ్ రాకూడదనే ఉద్దేశంతో హష్మతుల్లా షాహిది ఓ పథకం వేశాడు. రజా ఆడిన ఆ బంతికి నాలుగు పరుగులు రావాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే బౌండరీ అవతల కాలు వేశాడు. దీనిని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు అహ్మద్ షా పాక్తీన్ మరియు అలీమ్ దార్ ఒక పరుగును (బౌండరీతో కలిపి మొత్తం 5 పరుగులు) జింబాబ్వే జట్టుకు అదనంగా ఇచ్చారు. అంతేకాదు తర్వాతి ఓవర్లో రజాకే బ్యాటింగ్ అవకాశం కల్పించారు. ది లాస్ ఆఫ్ క్రికెట్ నిబంధన 19.8 ప్రకారం జరిమానా వేశారు.
ఫాలోఆన్ ఆడుతూ.. ఓవర్నైట్ స్కోరు 266/7తో చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 365 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (151 నాటౌట్; 309 బంతుల్లో 13×4, 1×6).. తిరిపానో (95; 258 బంతుల్లో 16×4)తో కలిసి అఫ్గాన్ బౌలర్లను విసిగించాడు. తిరిపానోను రషీద్ ఖాన్ (7/137) ఔట్ చేయడంతో కాసేపటికే జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది. ఆపై 108 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
21వ శతాబ్దంలో ఒక టెస్టులో అత్యధిక ఓవర్లు (99.2) వేసిన బౌలర్గా ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 36.3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్లో 62.5 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఒక టెస్టులో అత్యధిక ఓవర్లు వేసిన ఘనత మాత్రం శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (113.5, ఇంగ్లాండ్పై 1998లో) పేరిట ఉంది.