ఇటీవలి కాలంలో క్రికెట్ అంపైర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచుల్లో చిల్లర పొరపాట్లు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కివీస్ బ్యాటింగ్ చేస్తుండగా.. బౌలర్ ఎన్ని బంతులు వేసిందీ లెక్క వేయడం అంపైర్ మర్చిపోయాడు.
అంతర్జాతీయంగా 150 మ్యాచుల్లో అంపైర్గా వ్యవహరించిన బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షర్ఫుద్దోలా ఈ మ్యాచులో తడబడ్డాడు. బ్రెయిన్ ఫేడ్ ఎదుర్కొన్న అతను.. బౌలర్ వేసిన బంతులు లెక్కించడం మర్చిపోయాడు. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న 47వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ ఈ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో కివీ కెప్టెన్ లోకీ ఫెర్గూసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఈ సమయంలో మెహదీ వేసిన డెలివరీలను లెక్కించడంలో షర్ఫుద్దోలా తడబడ్డాడు. దీంతో మెహదీ హసన్ సాధారణంగా వేయాల్సిన ఆరు బంతులకు బదులు.. ఈ ఓవర్లో ఏడు బంతులు వేశాడు. ఈ ఎక్స్ట్రా బంతి వల్ల రెండు జట్లకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఫెర్గూసన్ భారీ షాట్ కోసం ప్రయత్నించాడు కానీ.. బంతిని కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు.
ఇక ఈ మ్యాచులో కివీ బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. బంగ్లా స్పిన్నర్లు కూడా కివీస్ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో 49.2 ఓవర్లలో న్యూజిల్యాండ్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో కివీ స్పిన్నర్ ఐష్ సోధీ చెలరేగాడు. ఏకంగా ఆరు వికెట్లతో అతను రెచ్చిపోవడంతో బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడారు. సీనియర్ బ్యాటర్లు తమీమ్ ఇక్బాల్ (44), మహ్మదుల్లా (49) మాత్రమే రాణించారు.
మిగతా వాళ్లలో ఎవరూ కనీసం నాసుమ్ అహ్మద్ (21) మినహా ఎవరూ 20 పరుగుల మార్కు కూడా దాటలేదు. బంగ్లా టీంలో ఏకంగా ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు 41.1 ఓవర్లలో కేవలం 168 పరుగులే చేసి ఆలౌట్ అయింది. అయితే అంపైర్ ఇలా ఓవర్ లెక్కించడంలో విఫలమవడంపై క్రికెట్ ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు.