
కరాచి: పాకిస్థాన్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్లో జరుగుతున్న లోకల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న ఓ మ్యాచ్లో అంపైర్కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కరాచి వేదికగా లాయర్స్ టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టీఎంసీ గ్రౌండ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్కు నసీమ్షేక్ (56) అంపైర్గా వ్యవహరించాడు. మ్యాచ్ జరుగుతుండగా నసీమ్షేక్ ఒక్కసారిగా కుప్పకూలాడు.
ఈ ఘటనతో కంగారు పడ్డ ఆటగాళ్లు, సిబ్బంది నసీమ్షేక్ దగ్గరికి వెళ్లారు. మరోవైపు డాక్టర్లు కూడా వచ్చి ప్రధమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్స్ ద్వారా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే నసీమ్షేక్ మార్గ మధ్యంలో మృతిచెందాడని క్రికెట్ నిర్వాహకులు తెలిపారు. అంపైర్ మరణంతో ఆటగాళ్లు అందరూ దిగ్బ్రాంతికి లోనయ్యారు.
అంపైర్ నసీమ్ వృత్తిరిత్యా చిరు వ్యాపారి. క్రికెట్పై ఉన్న ఇష్టంతో అర్హత కలిగిన అంపైర్గా మారాడు. ఈ క్రమంలోనే అతడు క్రికెట్ అంపైర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇదివరకే నసీమ్కు ఆంజియోగ్రామ్ ఆపరేషన్ జరిగిందని సమాచారం తెలుస్తోంది. సోమవారం మ్యాచ్ మదయాలో మళ్లీ గుండెపోటు రావడంతో నసీమ్ మృతిచెందాడని అక్కడి స్థానిక మీడియా ఓ ప్రకటనలో తెలిపింది.
లాహోర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక ఘన విజయం సాధించింది. లంక యువ బ్యాట్స్మన్ భానుక రాజపక్స చెలరేగడంతో సోమవారం జరిగిన టీ20లో 35 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. పాకిస్తాన్తో వన్డే సిరీస్ను కోల్పోయిన లంక టీ20 సిరీస్లో మాత్రం దుమ్ములేపుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది.