
కెరీర్లో భాగమే..
ఇలా కుల్దీప్ను రెండో టెస్టులో పక్కన పెట్టడంపై టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ స్పందించాడు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన ఉమేష్.. ఇలా వేటు పడటం అనేది కూడా కెరీర్లో భాగమే అన్నాడు. 'అది మన ప్రయాణంలో భాగం. నాక్కూడా ఇలాగే జరిగింది.
ఒక్కోసారి మనం రాణిస్తాం. కొన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పిందని బెంచ్కే పరిమితం అవుతాం. అయితే తొలి టెస్టులో పునరాగమనం చేసి రాణించడం మాత్రం కుల్దీప్కు మేలే చేస్తుంది' అని ఉమేష్ వివరించాడు. అతన్ని పక్కన పెట్టాలనేది జట్టు, మేనేజ్మెంట్ కలిపి తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు.

పిచ్ ఎలా ఉందంటే?
జట్టు ఎంపికలో పిచ్ పాత్ర కూడా ఉంటుందని ఉమేష్ అన్నాడు. 'కొన్నిసార్లు జట్టు అవసరాలను బట్టి ఎంపిక ఉంటుంది. పిచ్ చూసిన తర్వాత మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది' అని చెప్పాడు. రెండో టెస్టు జరుగుతున్న ఢాకా పిచ్ అటు పేసర్లకు, ఇటు స్పిన్నర్లకు ఎవరికీ పూర్తిగా సహకరించడం లేదన్నాడు.
ఇదొక 50-50 తరహా వికెట్ అని చెప్పాడు. కొన్ని బంతుల్లో మూవ్మెంట్ ఉండగా.. కొన్నింటిలో ఏం ఉండటం లేదన్నాడు. తను బౌలింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ వేస్తే ఆడటం కష్టంగా అనిపించిందని చెప్పాడు. అదే సమయంలో ఫుల్ డెలివరీలు వేస్తే ఏమాత్రం స్వింగ్ కనిపించలేదని వివరించాడు.

నాలుగు వికెట్లతో రాణించిన ఉమేష్..
రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు ముగిసే సరికి బంగ్లాదేశ్ ఆలౌట్ అవగా.. ఉమేష్ యాదవ్ ఆ జట్టు నడ్డి విరిచాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 15 ఓవర్లు వేసిన అతను నాలుగు మెయిడెన్లు వేశాడు. కేవలం 25 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ కూడా రాణించాడు.
తను కూడా నాలుగు కీలక వికెట్లు తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 227 పరుగులకు ఆలౌట్ అయింది.


Click it and Unblock the Notifications












