హైదరాబాద్: క్రీడాకారులు టాటూలు వేయించుకోవడం మామూలే. ఈ మధ్య కాలంలో భారత క్రికెటర్లు విభిన్న తరహాలో టాటూలు వేయించుకోవడాన్ని మనం చూశాం. తాజాగా టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తన ఎడమ భుజంపై సింహం, యోధుడి టాటూ వేయించాడు.
2012లో ఉమేశ్ యాదవ్ తల్లి మరణించినప్పుడు తొలిసారిగా టాటూ వేయించుకున్న ఉమేశ్ యాదవ్కి ప్రస్తుత టాటూ ఐదోది. తాజాగా ఓ ఇంటర్యూలో ఈ టాటూ గురించి ఉమేశ్ యాదవ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఉమేశ్ యాదవ్ వేయించుకున్న టాటూ తనలోని గుణగణాలకు ప్రతీక అని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు తాను పడిన కష్టాలకు, లభించిన గుర్తింపునకు నిదర్శనమని చెప్పుకొచ్చాడుు. అంతకముందు శివుడి టాటూ చెరిగిపోతుండటంతో తన జీవితానికి చక్కగా సరిపోయే టాటూను వేయించుకున్నానని ఉమేశ్ యాదవ్ కొత్త టాటూ గురించి చెప్పాడు.
'సింహం, యోధుడి కలయిక అద్భుతంగా కుదిరింది. నా జీవితంలో ప్రతి అంశాన్ని గుర్తుచేస్తుంది. దేశం తరఫున ఫాస్ట్ బౌలర్ అయ్యేందుకు నేను పడ్డ కష్టాలు, అనుభవించిన ఒంటరి జీవితం, చేసిన ప్రార్థనలు ఇలా అన్నిటికీ ఈ టాటూ నిదర్శనం' అని ఉమేశ్ యాదవ్ అన్నాడు.
'అలసట లేని కష్టంతో అడవికి సింహం రాజైనట్టే నా కష్టంతో నేనూ రాజు (భారత జట్టులోని ఓ బౌలర్) అయ్యా. ఈ టాటూ నా జీవితంలో నేనింత వరకు సాధించిన విజయాలకు ప్రేరణగా నిలుస్తోంది. ఇప్పటివరకు తన జీవితంలో సాధించిన విజయాలకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.
'సింహం, యోధుడు నా దూకుడుకు ప్రతిబింబమైతే ఇప్పటికే నా ఒంటిపై ఉన్న బుద్ధుడు నాకు కావాల్సిన సహనం, అభిరుచికి గుర్తు. ఏది ఏమైనప్పటికీ నేను సంతోషంగా ఉన్నా' అని ఉమేశ్ పేర్కొన్నాడు.