సిడ్నీ: ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అతను ఈసారి ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్లో, తిరిగి సెమీ ఫైనల్స్లో నాలుగేసి వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ కప్లో ఇప్పటి వరకూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఉమేష్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 21 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఉమేష్ ఖాతాలో 18 వికెట్లు ఉన్నాయి. షమీ 17 వికెట్లు కూల్చాడు.
ప్రపంచ కప్ ఫైనల్కు ఒక్క ఆసియా జట్టు కూడా చేరకపోవడం 1987 తర్వాత ఇదే మొదటిసారి. 1992 నుంచి 2011 వరకూ పాకిస్తాన్, శ్రీలంక లేదా భారత్లో ఏదో ఒక జట్టు ఫైనల్లో స్థానం సంపాదించింది. 1987లో ఆసియా జట్టు ఏదీ ఫైనల్లోకి అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు ఇంగ్లాండ్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
1992లో పాకిస్తాన్ టైటిల్ను అందుకోగా, ఏడేళ్ల తర్వాత ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. నాలుగేళ్ల క్రితం భారత్ ఫైనల్ చేరడమేగాక, టైటిల్ను కూడా సాధించింది. 2003 ఎడిషన్లో టీమిండియా ఫైనల్ చేరినా, ఆసీస్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. 1996లో ట్రోఫీని కైవసం చేసుకున్న శ్రీలంక 2007, 2011 సంవత్సరాల్లో ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయింది.

ఒక ప్రపంచ కప్లో 400 లేదా అంతకు మించి పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ జాబితాలో శిఖర్ ధావన్కు స్థానం దక్కింది. గురువారం నాటి మ్యాచ్లో 45 పరుగులు చేసిన అతని ఈవరల్డ్ కప్లో మొత్తం 412 పరుగులు సాధించాడు. సచిన్ 1996, 2003, 2011 సంవత్సరాల్లో ఈ ఫీట్ను సాధించగా, సౌరవ్ గంగూలీ 2003, రాహుల్ ద్రావిడ్ 1999 సంవత్సరాల్లో 400లకు పైగా పరుగులు చేశారు. వీరి సరసన ఇప్పుడు శిఖర్ ధావన్ చేరాడు.
ఓటమికి కారణాలెన్నో...
సెమీ ఫైనల్లో భారత్ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ను దెబ్బతీసిందని చెబుతున్నారు. ఐతే ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు భిన్నంగా ఆడిందంటున్నారు. ముఖ్యంగా, కోహ్లీ, ఆ వెంటనే రోహిత్ అవుట్ కావడం, అంతకుముందు ధావన్ అవుట్ కావడం దెబ్బతీసిందని చెబుతున్నారు.
అలాగే, తొలుత ఆస్ట్రేలియా భారీ పరుగులు సాధిస్తుందని భావించారని, ఆ తర్వాత భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారని, మళ్లీ స్లాగ్ ఓవర్లలో భారీగా పరుగులు ఇవ్వడం దెబ్బతీసింది. ఆస్ట్రేలియా 328 పరుగులు చేసినప్పుడే దాదాపు మ్యాచ్ అయిపోయింది. ఈ లక్ష్యాన్ని చేరాలంటే కోహ్లీ లేదా రోహిత్ శర్మలు మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండగా.. ఆడలేదని చెబుతున్నారు.