
ముంబై: టీమిండియా స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ తండ్రయ్యాడు. ఉమేష్ సతీమని తాన్య వాద్వా శుక్రవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఉమేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చిన్న పాప ఫోటోను షేర్ చేస్తూ.. 'ఈ ప్రపంచంలోకి స్వాగతం చిన్ని రాకుమారి. నీ రాకతో ఎంతో థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నా' అని ట్విటర్లో పేర్కొన్నాడు. ఆ ఫొటోకు 'ఆమె ఒక బాలిక' అని కాప్షన్ పెట్టాడు. ఉమేష్, తాన్య వాద్వాలా వివాహం 2013లో జరిగింది. వీరిద్దరికి ఇదే మొదటి సంతానం.
తండ్రయిన ఉమేష్ యాదవ్కు సహచరులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ యాదవ్కు అభినందనలు తెలిపింది. 'ఈరోజు కూతురు పుట్టినందుకు ఉమేష్ యాదవ్కు అభినందనలు. ఇక అతడు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.నిన్ను త్వరలో మైదానంలో చూడాలని మేము ఆశిస్తున్నాం' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఉమేష్ భారత్ తరఫున 48 టెస్టులు, 75 వన్డేలు 7 టీ20లు ఆడాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఉమేశ్ యాదవ్.. త్వరలో భారత్కు రానున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో ఉమేష్ యాదవ్ పిక్క కండరం పట్టేయడంతో అతడు ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన ముద్దుల కూతురితో కాస్తా సమయం గడిపేందుకు అవకాశం దొరికినట్లైంది. ఈ పర్యటనలో ఉమేష్ యాదవ్ రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్ట్ రెండవ ఇన్నింగ్స్లో 3.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు.
ప్రస్తుతం టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా పేసర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాడు. ఆసీస్ సిరీసుకు ముందే భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ గాయపడ్డారు. ఇక ఆసీస్తో మ్యాచులు ఆడుతున్నప్పుడు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయపడ్డారు. వారిని పరిశీలించిన వైద్యబృందం విశ్రాంతి అవసరమని సూచించింది. దాంతో షమి స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ బదులు నటరాజన్ జట్టులోకి వచ్చారు.