అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు
గాయం కారణంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్పీత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్కు దూరమైనప్పటికీ ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు అద్భుత ప్రదర్శన చేశారు. తాజాగా ది హిందుకు ఇచ్చిన ఇంటర్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ "ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. టెస్టుల్లో 400 వికెట్లను అందుకునే దిశగా దూసుకెళ్తున్నాడు" అని అన్నాడు.
అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జడేజా
"ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అశ్విన్ నెంబర్ వన్ స్పిన్నర్గా కొనసాగాడు. ఇక, అందివచ్చిన అవకాశాల్ని జడేజా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. బంతితో, బ్యాటుతో అద్బుత ప్రదర్శన చేస్తున్నాడు. ఫీల్డింగ్లోనూ జట్టుకు బలంగా మారుతున్నాడు. విదేశీ పిచ్లపై వీరిద్దరిలో ఒకరినే ఎంపిక చేయాలంటే అక్కడి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం" అని భరత్ అరుణ్ తెలిపాడు.
ఐదు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్
"కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆసీస్తో ఆడిన ఆఖరి టెస్టులో అతడు ఐదు వికెట్లతో సత్తాచాటాడు" అని భరత్ అరుణ్ తెలిపాడు. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మహ్మద్ షమీ 13 వికెట్లు తీయగా... ఉమేశ్ యాదవ్ 11 వికెట్లతో చెలరేగాడు. దీంతో వీరిద్దరిపై భరత్ అరుణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
బ్యాట్స్మెన్ను భయపెడుతున్న ఉమేశ్ యాదవ్
"ఉమేశ్ యాదవ్ రివర్స్ స్వింగ్తో బ్యాట్స్మెన్ను భయపెడుతున్నాడు. షమీకి తోడుగా ఉమేశ్ యాదవ్ కలవడంతో పేస్ విభాగం మరింత పటిష్టంగా మారింది. కేవలం మనకు పేసర్లు మాత్రమే కాదు, వైవిధ్య బంతుల్ని వేయగలిగే పేసర్లు ఉన్నారు. గతంలో 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలిగే బౌలర్లు ఇద్దరు మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు భారత్కు ఎంతో మంది ఉన్నారు" అని తెలిపాడు.
బుమ్రా గాయంపై అప్డేట్
మరోవైపు వెన్నులో కింది వైపున చీలిక రావడంతో సఫారీతో సిరిస్కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై భరత్ అరుణ్ స్పందించాడు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. అయితే, ప్రస్తుతానికి బుమ్రాకు ఎలాంటి సర్జరీ అవసరం లేదని భరత్ అరుణ్ తేల్చి చెప్పాడు.