|
ఉమేశ్ ఇన్.. శార్దూల్ ఔట్:
విజయ్ హజారె ట్రోఫీలో పాల్గొనేందుకు వీలుగా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను భారత జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఠాకూర్ ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. 'టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఫిబ్రవరి 21న మొతేరా స్టేడియంలో జరిగిన ఫిట్నెస్ టెస్టుకు హాజరయ్యాడు. అందులో అతడు పాస్ అయ్యాడు. ఇంగ్లండ్తో జరగనున్న చివరి రెండు టెస్టులకు జట్టులో చేర్చబడ్డాడు' అని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
బ్యాటింగ్ లైన్ప్ యథాతథం
మొతేరా స్టేడియంలో జరుగనున్న మూడో టెస్ట్ వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్ కోణంలోంచి చూస్తే.. టీమిండియాకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లైనప్ను టీమిండియా యథాతథంగా కొనసాగించనుండగా.. బౌలింగ్లో మార్పులు చేయనుంది. పేసర్లు జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఫిట్నెస్ నిరూపించుకున్న ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి రానుండగా.. మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం అయ్యే చాన్సులున్నాయి. స్పిన్ ఆల్రౌండర్లుగా ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్తో పాటు పేసర్ ఇషాంత్ శర్మ తుది జట్టులో ఆడడం ఖాయమే.
కుల్దీప్ను పక్కనపెట్టే అవకాశం:
మొతేరా పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉన్నా.. పింక్ బాల్ కావడంతో సంధ్యా సమయం, మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తుది జట్టును ఖరారు చేయాలని భారత జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్ను గ్రీన్ వికెట్పై ఎదుర్కొన్న అనుభవం టీమిండియాకు లేదు. మంచు కారణంగా బంతిపై స్పిన్నర్లకు గ్రిప్ సరిగా చిక్కదనే కారణంతో పాటు బ్యాటింగ్ చేయలేని కుల్దీప్ను పక్కనపెట్టే అవకాశముంది. మూడో సీమర్గా సిరాజ్ కంటే ఎంతో అనుభవం ఉన్న ఉమేష్ వైపే మొగ్గు చూపొచ్చు.
|
చివరి రెండు టెస్టులకు భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.