
హైదరాబాద్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఉమర్ అక్మల్కు ఇవి నిజంగా గడ్డు రోజులే. ప్రధాన కోచ్తో గొడవ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇస్లామాబాద్లో పాకిస్థాన్ ఆర్మీకి ఓ మతసంస్థ మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
కాగా ఆ మరణించిన వారిలో ఉమర్ అక్మల్ కూడా ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న రూమర్స్ వచ్చాయి. ఈ దాడిలో ఉమర్ అక్మల్ తీవ్రంగా గాయపడ్డారని, ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని వార్తా కథనాలు ప్రసారమయ్యాయి.
దీంతో అటు అభిమానులతో పాటు పాకిస్థాన్ జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తనపై వస్తున్న వార్తలపై తాజాగా ఉమర్ అక్మల్ ట్విట్టర్లో స్పందించాడు. తాను చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సైతం ఖండించాడు.
తాను బతికే ఉన్నానని, తనకు ఏం జరుగలేదని, ఆరోగ్యంగా ఉన్నానని వీడియో రూపంలో ట్వీట్ను అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశాడు. తన చావుపై వస్తున్న వార్తలన్ని కేవలం పుకార్లు మాత్రమేనని ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాను త్వరలో జరిగే నేషనల్ టీ20 కప్లో పాల్గొంటానని తెలిపాడు.