
కరాచీ: సీనియర్ బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేసింది. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కొందరు తనను సంప్రదించిన విషయాన్ని తెలపనందుకు అక్మల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. అక్మల్ మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకుండా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మిరాన్ చౌహాన్ నిషేధం విధించినట్లు పేర్కొంది.
పీఎస్ఎల్ 2020 ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందే క్వెటా గ్లాడియేటర్స్ ఆటగాడైన ఉమర్ అక్మల్ను పీసీబీ సస్పెండ్ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిగినా.. ఫిర్యాదు చేయలేదని తేల్చిన పీబీసీ అవినీతి నిరోధక విభాగం అతడిపై గత నెల రెండు కేసులను నమోదు చేసింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసినా.. అక్మల్ స్పందించలేదు.
అక్మల్ ఫిక్సింగ్ విషయాన్ని దాచిపెట్టడంతో ఫిబ్రవరి 20నే అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. పీఎస్ఎల్కు దూరంగా ఉంచి విచారణ జరిపారు. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో క్రమశిక్షణ కమిటీ మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ట్వీట్ చేసింది.
గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్లో అక్మల్ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.
29 ఏళ్ల ఉమర్ అక్మల్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కమ్రాన్ అక్మల్కు సొంత తమ్ముడు. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్కు కూడా వరుసకు సోదరుడవుతాడు. ఉమర్ అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.