
హైదరాబాద్: మోడ్రన్ క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అలాంటి విరాట్ కోహ్లీని చూసేందుకు ఏకంగా 8,600 మైళ్లు ప్రయాణించి వచ్చారో జంట. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు కేప్ టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ను తిలకించేందుకు లండన్ నుంచి జాన్-క్రిసియా దంపతులు కేప్టౌన్కు వచ్చారు. ఈ దంపతులకు కేప్టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియం అంటే ఎంతో ఇష్టమట. గతంలో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఓ టెస్టు మ్యాచ్ చూసేందుకు కూడా ఈ జోడీ ఇక్కడికి వచ్చారు.
అయితే, కేవలం కోహ్లీ కోసమే తాము ఈ టెస్టు మ్యాచ్ చూసేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'క్రిసియాతో పాటు నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. 2016లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ చూసేందుకు తొలిసారి ఇక్కడికి వచ్చాం. ఆ టెస్టు డ్రా అయ్యింది' అని తెలిపారు.
'న్యూలాండ్స్ స్టేడియంలో గడపడం అంటే మాకు ఎంతో ఇష్టం. ఈ సారి భారత్.. దక్షిణాఫ్రికా వచ్చి ఆడుతోందని తెలిసింది. వెంటనే మేమిద్దరం ఈ మ్యాచ్ని ఎలాగైనా సరే వీక్షించాలని అనుకున్నాం. ఎందుకంటే విరాట్ కోహ్లీని చూడొచ్చని. మా ఇద్దరికీ విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. అతని బ్యాటింగ్ శైలి అంటే ఇంకా ఇష్టం' అని చెప్పారు.
'అతనో గొప్ప ఆటగాడనేది మా ఇద్దరి అభిప్రాయం. అంతేకాదు కేప్టౌన్ టెస్టులో మంచి ప్రదర్శన చేస్తాడనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తూ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఇన్నింగ్స్ ఉంది కదా అని వేచి ఉన్నాం' అని రెండో ఇన్నింగ్స్కు ముందు జాన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.
ఇదిలా ఉంటే కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కూడా కోహ్లీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫిలాండర్ బౌలింగ్లో కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి టెస్టులో భారత్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు సెంచూరియన్ వేదికగా శనివారం ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.