
దుబాయ్ : 'ఇంటర్నేషనల్ లీగ్ టీ20' మొదటి ఎడిషన్ 2023 సంవత్సరం జనవరి 6 నుండి ఫిబ్రవరి 12వరకు నిర్వహించనున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ఈ లీగ్ను 'ILT20' అని పిలుస్తారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహాయన్ మాట్లాడుతూ.. 'రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్కతా నైట్ రైడర్స్, కాప్రి గ్లోబల్, GMR, లాన్సర్ క్యాపిటల్, అదానీ స్పోర్ట్స్లైన్, బ్రాడ్కాస్టర్ ZEEకి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తరఫున స్వాగతం పలుకుతున్నాం.
UAE ప్రారంభిస్తున్న టీ20 లీగ్కు ప్రముఖ, అనుభవజ్ఞులైన సంస్థలు ఫ్రాంఛైజీ ఓనర్లుగా ఉండడం శుభకరం. వీరందరు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్పై విశ్వాసాన్ని ప్రదర్శించడాన్ని స్వాగతిస్తున్నాం. మేము క్రికెట్ ఫ్యూచర్ మరింత ముందుకు తీసుకెళ్తాం' అని పేర్కొన్నారు. UAE T20 లీగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది అభిమానులకు వినోదం, ఆనందాన్ని అందిస్తామని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ఆటగాళ్లకు మా సాంప్రదాయ ఆతిథ్యం ద్వారా చక్కని క్రీడానుభూతిని అందిస్తామని స్పష్టం చేశారు. ఇకపోతే ఆరు జట్ల ఫ్రాంచైజీలతో ఐఎల్టీ టీ 20 లీగ్ నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియాల్లో 34 మ్యాచ్లతో షెడ్యూల్ రూపొందించారు. ఇక ఈ లీగ్ మొదటి ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ద్వారా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు స్థానిక ప్రతిభను వెలికితీయడంతో పాటు స్థానిక ప్లేయర్లను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి ఒక విలువైన వేదికను అందించనుంది.
ILT20 చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ మాట్లాడుతూ.. 'ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం క్రికెట్ ఆటను ప్రోత్సహించేందుకు రకరకాల కార్యక్రమాలను నిర్వహించడంలో మంచి చరిత్రను కలిగి ఉన్నాయి. ఈ టోర్నమెంట్ ద్వారా UAE ఆధారిత ఆటగాళ్లు రాటుదేలడానికి అవకాశం లభిస్తుంది. ఈ లీగ్ యొక్క ప్రముఖ లక్ష్యం కూడా అదే. క్రికెట్ ఇష్టపడేవారికి అసమానమైన పోటీని, వినోదాన్ని అందించేందుకు ఈ T20 ఈవెంట్ను నిర్వహించడానికి మేము ఎదురుచూస్తున్నాం' అని తెలిపాడు.