ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత యూఏఈ జట్టు హెడ్ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత బౌలింగ్ చాలా ప్రమాదకరంగా ఉందని.. తమ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అలాంటి నాణ్యమైన బౌలింగ్ను ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆయన అన్నారు. తమ ఆటగాళ్లకు ఇది కొత్త అనుభవమని పేర్కొన్నారు.
భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ఆసియా కప్ తొలి మ్యాచ్లోనే భారత్, యూఏఈని కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, శివమ్ దూబే 3 వికెట్లు తీసి యూఏఈ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. ఈ ఇద్దరితో పాటు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు కూడా తమ వంతుగా ఒక్కో వికెట్ పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ను కుప్పకూల్చారు.

భారత్ బౌలింగ్పై యూఏఈ కోచ్ ఆశ్చర్యం
ఈ ఓటమిపై యూఏఈ హెడ్ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ మాట్లాడుతూ.."మా బ్యాటర్లు ఇంత అద్భుతమైన బౌలింగ్ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. టీమిండియాలోని ఆటగాళ్ల పేర్లను చూసి వారు ఒత్తిడికి లోనయ్యారు" అని ఒప్పుకున్నారు. టీమిండియా వ్యూహంపై కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జస్ప్రీత్ బుమ్రా వంటి ఒకే ఒక్క స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగి.. స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా.. అర్ష్దీప్ సింగ్ లాంటి స్టార్ బౌలర్కు తుది జట్టులో చోటు దక్కకపోవడం చూస్తే.. భారత జట్టులో ఎంత ప్రతిభ ఉందో అర్థం చేసుకోవచ్చని లాల్చంద్ రాజ్పుత్ పేర్కొన్నారు. "ప్రపంచ ఛాంపియన్ జట్టు మిగతా జట్లను ఓడించగలదు. పవర్ప్లే వరకు అంతా బాగానే ఉంది. కానీ స్పిన్నర్లు రంగంలోకి దిగగానే పరిస్థితి మారిపోయింది. పిచ్ పెద్దగా టర్న్ అవ్వకపోయినా కుల్దీప్, వరుణ్ లాంటి బౌలర్లు బౌలింగ్ చేస్తే పెద్ద పెద్ద బ్యాటర్లు కూడా కష్టపడతారు" అని ఆయన భారత బౌలర్లను ప్రశంసించారు.
2007 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్నప్పుడు భారత జట్టుకు కోచ్గా పనిచేసిన లాల్చంద్ రాజ్పుత్.. అఫ్ఘానిస్తాన్ జట్టుకు కూడా కోచ్గా వ్యవహరించారు. భారత్ చేతిలో ఈ ఓటమి నుంచి యూఏఈ జట్టు త్వరగా కోలుకుని రాబోయే మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఓటమి తమ ఆటగాళ్లకు ఒక మంచి గుణపాఠం అని ఆయన అన్నారు.