బెంగళూరు: వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్ 19 ప్రపంచకప్ను గెలుచుకున్న యువ భారత్ సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టింది. బెంగళూరు చేరుకున్న యువ భారత జట్టుకు ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు వారు వెస్టిండీస్ నుంచి ఇండియాకు వచ్చే క్రమంలో ఆమ్స్టర్డామ్, దుబాయ్లో ఆగారు. బుధవారం ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టును అహ్మదాబాద్లో బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది. కాగా అక్కడే ఉన్న టీమిండియా సీనియర్ జట్టు కూడా ప్రపంచకప్ గెలిచిన యువ భారత ఆటగాళ్లను కలిసి అభినందించనుంది. ఈ సందర్భంగా సీనియర్ జట్టు ఆటగాళ్లు యువ జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించనున్నారు.
వెస్టిండీస్లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్లో భారత యువ ఆటగాళ్లను కరోనా కలవర పరిచినప్పటికీ జట్టు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. పలు మ్యాచ్లలో కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగి ఘన విజయం సాధించింది. కాగా వరల్డ్కప్ జరుగుతున్న సమయంలో కెప్టెన్ యష్ ధూల్తో సహా, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారి నుంచి కోలుకుని వచ్చి వీరిద్దరు అద్బుతంగా రాణించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరు ఏకంగా 200కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ యష్ ధూల్ సెంచరీ కూడా సాధించాడు.
ఇక ఆంటిగ్వా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ అండర్ 19 జట్టును భారత అండర్ 19 జట్టు మట్టికరిపించి ప్రపంచకప్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 189 పరుగులకే కుప్పకూలించింది. ఆ జట్టులో జేమ్స్ రూ మినహా ఎవరూ రాణించలేకపోయారు. రూ ఒక్కడే 95 పరుగులతో అదరగొట్టాడు. అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి చేధించి విశ్వ విజేతగా నిలిచింది. నిశాంత్ సింధు, షేక్ రషీద్ హాఫ్ సెంచరీలతో రాణించారు. తద్వారా టీమిండియా ఐదో సారి అండర్ 19 ప్రపంచకప్ను అందుకుంది. ఇప్పటికే అండర్ 19 ప్రపంచకప్ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఉన్న టీమిండియా ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.